పన్నీర్ చెంత ఎంపీలు... శశికళ చెంత ఎమ్మెల్యేలు.. బెడిసికొట్టిన వ్యూహాలు!
తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా స్తంభనకు గురయ్యాయా? ఆదివారం సాయంత్రానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ శిబిరాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకోకపోవడంతో అధికారం ఎవరికి చెందుతుందనే అంశంపై అనిశ్చితి కొనసా
తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా స్తంభనకు గురయ్యాయా? ఆదివారం సాయంత్రానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ శిబిరాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకోకపోవడంతో అధికారం ఎవరికి చెందుతుందనే అంశంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఎంత ప్రయత్నించినా ఎంపీలు తనవైపుకు వస్తున్నారే తప్ప ఎమ్మెల్యేలు పెద్దగా స్పందించకపోవడం పన్నీర్ సెల్వంలో ఆలోచనలను రేకెత్తించగా ఎంపీలు అంతమంది పన్నీర్ సెల్వం వద్దకు ఎందుకు వెళ్లారు అనేది శశికళకు పజిల్గా మారింది. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలూ తమ బలగాల స్థిరీకరణకు కొత్త వ్యూహాల రచనలో మునిగిపోయారు.
జయలలిత సమాధి సాక్షిగా శశికళపై పన్నీర్ సెల్వం తిరుగుబాటు జెండా ఎగురవేసి ఐదు రోజులైంది. ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు ఆయన అనేక వ్యూహాలు అమలు చేశారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, సినీ ప్రముఖుల మద్దతు సంపాదిం చడంలో సఫలీకృతులయ్యారు. అయితే, ఆదివారం సాయంత్రం వరకు ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే పన్నీర్కు జై కొట్టారు. ఇప్పుడు పన్నీర్ వర్గంలో ఆయనతో కలిపి ఏడుగురు ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆదివారం ఎంపీలు జయసింగ్ త్యాగరాజన్(తూత్తుకుడి), సెంగుట్టువన్ (వేలూరు), మారుతీరాజా (పెరంబలూరు) రాజేంద్రన్ (విల్లుపురం), లక్ష్మణన్ (రాజ్యసభ), పార్తీబన్(తేని) మద్దతు ప్రకటించడంతో పన్నీర్కు ఇప్పటివరకూ 11 మంది ఎంపీల బలం తోడైంది.
అయితే శశికళ శిబిరం నుంచి 11 మంది ఎంపీలతోపాటు అన్నాడీఎంకే నేతలు తన శిబిరంలోకి వచ్చినా, ఆశించిన సంఖ్యలో ఎమ్మెల్యేలు రాకపోవడం పట్ల తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆలోచనలో పడ్డారు. ఆదివారం నాటికి కనీసం 25 మంది శాసనసభ్యులు తన గూటికి చేరుతారని ఆయన భావించారు. అయితే, మంత్రి పాండియరాజన్ మాత్రమే వచ్చి చేరారు. దీంతో శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలకు ఎలా వల వేయాలనే దానిపై పన్నీర్సెల్వం వర్గం కసరత్తు చేస్తోంది. అన్నాడీఎంకే ఎంపీలు పన్నీర్ సెల్వం శిబిరంలోకి ఎందుకు పరుగులు తీస్తున్నారు దీని వెనుక రహస్యం ఏమిటి అని శశికళ వర్గం ఆరా తీస్తోంది.
ఎమ్మెల్యేలను ఉంచిన ప్రదేశం ప్రైవేట్ది కావడంతో తానే స్వయంగా వెళ్లి వారితో మాట్లాడేందుకు పన్నీర్ సెల్వం సిద్ధమైనట్లు సమాచారం. అయితే, పోలీసు అధికారులు వారించడంతో ఆయన వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ఈ విషయం తెలియడంతో శశికళ మద్దతుదారులు మరింత అప్రమత్తమయ్యారు. రిసార్ట్ చుట్టూ భారీ ఎత్తున ప్రైవేట్ సైన్యాన్ని మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
శశికళ శిబిరం నుంచి మాయమైన ముగ్గురు ఎమ్మెల్యేలు తమవైపు వస్తారని పన్నీర్ సెల్వం భావించినా వారి నుంచి వర్తమానం అందలేదు. మరో రెండు, మూ డు రోజుల్లో తమ వర్గంలోని ఎమ్మెల్యేల సంఖ్య మూడంకెలకు (వందకుపైగా) చేరుతుందని పాండియరాజన్ ప్రకటిం చారు. మరోవైపు ఎంపీలు తన పట్టు నుంచి జారిపోతుండడాన్ని శశికళ తేలిగ్గా తీసుకున్నారు. ఎందుకు వెళుతున్నారో, ఎవరు పంపుతున్నారో వారినే అడగండి అని మీడియాతో వ్యాఖ్యానించారు. పన్నీర్ సెల్వం ఎన్ని ఎత్తులు వేసినా ఎమ్మెల్యేలను కాపాడుకోగలుగుతానని శశికళ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు తమ వద్దకు ఎందుకు రావడం లేదని పన్నీర్ సెల్వం వర్గం మంతనాలు సాగిస్తోంది. లోపం ఎక్కడుంది మెజారిటీ ఎమ్మెల్యేలను ఆకర్షించాలంటే ఇంకా ఏం చేయాలి అనే దానిపై పన్నీర్ వర్గంలోని ముఖ్య నేతలు ఆదివారం విస్తృతంగా చర్చిం చారు. సోషల్ మీడియా ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచడం, వారి కుటుంబ సభ్యులను నేరుగా కలవడం, పన్నీర్ సెల్వంతో ఫోన్లో మాట్లాడించి హామీలు ఇప్పించడం వంటి వ్యూహాలు అమలు చేయాలని నిర్ణయిం చారు. ఇందులో భాగంగానే మంత్రి పాండియ రాజన్ ఆదివారం మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజన్ను కలిసి చర్చలు జరిపారు. పన్నీర్ సెల్వంతో ఫోన్లో మాట్లాడించి ఆహ్వానించేలా చేశారు. అయితే, తాను ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయమూ తీసుకోలేనని నటరాజన్ సమాధానం ఇచ్చారు.
94 మంది ఎమ్మెల్యేలు మాత్రమే శశికళ నిర్వహిస్తున్న క్యాంప్లో ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కనిపించని 32 మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు. వారి మద్దతు ఎవరికి అనేది అస్పష్టంగా ఉంది. ఒకవేళ వారు శిబిరం బయటే విడిగా ఉంటే పన్నీర్ సెల్వం క్యాంపుకు వారు ఎందుకు రాలేదన్నది ప్రశ్నార్థకమైంది.