Publish Date: Sat, 27 Feb 2021 (12:23 IST)
Updated Date: Sat, 27 Feb 2021 (12:28 IST)
అసెంబ్లీ ఎన్నికల్లో ఇందియా జననాయగ కట్చితో (ఐజేకేతో) పొత్తుపెట్టుకుని కూటమిగా బరిలో దిగుతామని తమిళనాడుకు చెందిన పాతతరం నటుడు, ఆలిండియా సమతువ మక్కల్ కట్చి (ఏఐఎస్ఎంకే) వ్యవస్థాపకుడు శరత్ కుమార్ వెల్లడించారు.
మంచి పేరు, నడవడిక ఉన్న వారినే మా కూటమి తరఫున బరిలో దించుతామని ఆయన చెప్పారు. ఇప్పటివరకు శరత్కుమార్ పార్టీ అధికార అన్నాడీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్నది. అటు ఐజేకే సహవ్యవస్థాపకుడు పారివెందర్ 2019 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే గుర్తుతో పోటీచేసి విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడటం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, తాము మరికొన్ని చిన్నపార్టీలను కలుపుకునే ప్రయత్నంలో ఉన్నామని శరత్కుమార్ తెలిపారు.
తాను కమల్ హాసన్ను కూడా కలిసి పొత్తు విషయమై మాట్లాడానని, తన ప్రతిపాదనపై ఎలా ముందుకు వెళ్లాలనేది వాళ్లు నిర్ణయించుకుంటారని చెప్పారు. మేం మాత్రం వారు త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని శరత్కుమార్ అభిప్రాయపడ్డారు.