భారతీయ జనతా పార్టీ తరపున కొత్తగా ఎంపికైన లోక్సభ సభ్యుల తీరు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేశారు. అసలు, ఈ ఎంపీలు ఏం చేస్తున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదని ఆయన వాపోయారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం జరిగింది.
ఇందులో మోడీ కూడా పాల్గొని మాట్లాడుతూ... కొత్త ఎంపీల పనితీరుపై అసహనాన్ని వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 'కొంతమంది ఎంపీలు ఏమి చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. పార్లమెంటుకు కూడా సరిగ్గా రావడం లేదు. ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నాయో కూడా అసలు కొంతమందికి తెలియదు' అని వ్యాఖ్యానించారు.
అదేసమయంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చి ఈనెల 26వ తేదీతో రెండేళ్లు పూర్తి అవుతోందనీ, అందువల్ల ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీలకు ఆయన సూచించారు. ముద్ర పథకం, 18,000 గ్రామాల్లో విద్యుదీకరణ, అదనంగా మరో మూడు కోట్ల కుటుంబాలకు ఎల్పీజీ గ్యాస్, తక్కువ ధరకే ఎల్ఈడీ లైట్ల పంపిణీ వంటి ముఖ్యమైన అంశాలకు విస్తృత ప్రచారం కల్పించాలని ప్రధాని మోడీ కోరారు.