ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 2025లో ఢిల్లీ ఎన్నికల కోసం బీజేపీ ఓవైపు ఉచిత హామీలతో పాటు.. గెలిచేందుకు ఏ అవకాశాన్ని విడిచిపెట్టలేదు. ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికలకు ముందు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఆ పార్టీకి కలిసొచ్చినట్లు చర్చ జరుగుతోంది.
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్లో మధ్య తరగతి ప్రజలను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఢిల్లీలో చాలామందికి నెలకు రూ.లక్ష వరకు జీతం ఉంటుంది. దీంతో ఎంత సంపాదించినా మధ్యతరగతి ప్రజలు పన్ను రూపంలో వేలకు వేలు కట్టాల్సి వస్తోంది.
దీంతో పన్ను మినహాయింపు రూ.12లక్షల వరకు పెంచడంతో మధ్య తరగతి ప్రజలు బీజేపీకి జై కొట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ గెలుపులో సగం మార్కులు పన్ను మినహాయింపుకేనంటూ ప్రచారం జరుగుతోంది.
ఇకపోతే.. బీజేపీకి రాజకీయ నేతల అభినందలు వెల్లువల్లా వస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) విజయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, ఈ ఫలితం ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజల విశ్వాసాన్ని మరోసారి రుజువు చేస్తోందని అన్నారు. మోదీ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా ఆయన పాలన నడిపిస్తోందని పవన్ కల్యాణ్ తెలిపారు.
మోదీ దార్శనికతను సాధించడంలో ఢిల్లీ కీలక పాత్రను పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం దేశ రాజధానిలో అట్టడుగు స్థాయిలో సమగ్ర అభివృద్ధి, సంక్షేమాన్ని నిర్ధారిస్తుందన్నారు.
ఆర్థిక అవకతవకలను తొలగించి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే పాలనా నమూనాను ఢిల్లీ ప్రజలు విశ్వసిస్తారని పేర్కొన్నారు. ఢిల్లీలో బిజెపి విజయం నగరవాసులు మోడీ నాయకత్వంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని పవన్ అభివర్ణించారు.