పళని స్వామి ప్రజా ఆకర్ష్ ప్లాన్.. 500 వైన్ షాపుల క్లోజ్... వెయ్యి కోట్ల నష్టం తప్పదా?
తమిళ ప్రజలకు రాజకీయ నేతలతో పెద్ద తలనొప్పి తప్పట్లేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేకపోవడంతో చిన్నమ్మతో ప్రజలు ఇబ్బందులు తప్పట్లేదు. చిన్నమ్మ జైలుకు వెళ్ళినా.. కటకటాల నుంచి పాలన చేస్తూనే వుంది. ఇప్పటికే
తమిళ ప్రజలకు రాజకీయ నేతలతో పెద్ద తలనొప్పి తప్పట్లేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేకపోవడంతో చిన్నమ్మతో ప్రజలు ఇబ్బందులు తప్పట్లేదు. చిన్నమ్మ జైలుకు వెళ్ళినా.. కటకటాల నుంచి పాలన చేస్తూనే వుంది. ఇప్పటికే తన వర్గం నేత పళనిస్వామిని సీఎం చేసేసిన చిన్నమ్మ.. ఆయనను కూడా గద్దె దించేసి దినకరన్ను కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే అన్నాడీఎంకే కార్యకర్తలు మాత్రం దినకరన్పై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పళని స్వామి తనవైపు ప్రజాబలాన్ని నిరూపించుకునేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎమ్మెల్యేల బలంతో సీఎం అయినా ప్రజాప్రతినిధిగా ఆయన విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు పక్కా ప్లాన్స్ వేస్తున్నారు.
గతంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు జయలలిత ముఖ్యమంత్రి కాగానే 500 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం గద్దెనెక్కిన పళనిస్వామి మరో 500 షాపుల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. పళని స్వామి ఆదేశాల ప్రకారం దుకాణాలు మూతబడితే.. అక్షరాలా వెయ్యికోట్ల రూపాయలు నష్టపోనుంది.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా, దాదాపు ఆరువేల మద్యం దుకాణాలున్నాయి. వీటి ద్వారా ఈ ఏడాది మార్చి నాటికి రూ.24వేల కోట్ల మేర ఆదాయం వస్తుంది. కానీ మద్యం షాపుల్ని మూతవేస్తే మాత్రం నష్టం తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు.