ఒక్క దెబ్బతో మన సైన్యం సత్తా - సామర్థ్యం గురించి తెలిసి వచ్చింది : నరేంద్ర మోడీ
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద తండాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. అయితే, ఆయన నేరుగా స్పందించక పోయినప్పటికీ.. ఇజ్రాయెల్ సైన్యంతో పోల్చుతూ భారత
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద తండాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. అయితే, ఆయన నేరుగా స్పందించక పోయినప్పటికీ.. ఇజ్రాయెల్ సైన్యంతో పోల్చుతూ భారత ఆర్మీపై ప్రశంసల వర్షం కురిపించారు.
హిమాచల్ ప్రదేశ్లోని మాండిలో మంగళవారం జరిగిన ఓ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ 'గతంలో ఇజ్రాయెల్ గురించి ఇలా మాట్లాడుకునేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ మన సైన్యం సామర్థ్యం గురించి తెలిసింది' అని వ్యాఖ్యానించారు.
శత్రుదేశాల్లోని మిలిటెంట్లు లక్ష్యంగా గతంలో ఇజ్రాయెల్ ఆర్మీ ఇలాంటి నిర్దేశిత దాడులు చేసిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ వీరుల భూమి అని ప్రధాని మోడీ కీర్తించారు. రాష్ట్రంలో దాదాపు ప్రతి ఇంటి నుంచి ఒక జవాన్ ఉన్నాడని పేర్కొన్నారు.
పాకిస్థాన్లో సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మన సైన్యం గురించే మాట్లాడుతున్నారనీ, ఈ విషయంలో మన జవాన్ల సత్తా ప్రపంచానికి తెలిసి వచ్చిందన్నారు.