దేశ ఐటీ రాజధాని బెంగుళూరు నగరంలోని రహదారులు, పరిశుభ్రతపై ఇపుడు సరికొత్త చర్చ సాగుతోంది. ఈ నగర రోడ్ల పరిస్థితిపై ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఇటీవల ఓ పోస్టు పెట్టగా అది వైరల్ అయింది. తాజాగా ఆమె భారత్లో చెత్త నిర్వహణపై పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఇలాంటి పరిస్థితి ఉండటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా చెత్త అనేది ఒక తీవ్రమైన సమస్యగా మారిపోయిందంటూ గురువారం ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. పెద్ద నగరాల్లోని మున్సిపాలిటీలు కూడా దీన్ని పరిష్కరించలేకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. ఇండోర్, సూరత్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల పేర్లను ఆమె ప్రస్తావించారు.
ఇది చాలా దయనీయమైన పరిస్థితి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇలాంటి విషయాలపై ప్రజలకు అవగాహన లేకపోవడాన్ని ఆమె ప్రశ్నించారు. ప్రజలు, పాలనాధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముంబై బాంద్రాలోని ఓ ప్రాంతంలో పడి ఉన్న చెత్తను ఉద్దేశిస్తూ జర్నలిస్టు సుచేతా దలాల్ పెట్టిన పోస్టుకు మజుందార్ షా ఇలా స్పందించారు.
గత కొంతకాలంగా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై మజుందార్ షా పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది. బయోకాన్ పార్క్కు వచ్చిన ఓ విదేశీ విజిటర్.. నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానని ఆమె వెల్లడించారు.
దీనిపై ఎందుకు తగిన చర్యలు తీసుకోలేకపోతున్నారో అర్థంకావడం లేదంటూ ఆయన పేర్కొన్నారని తెలిపారు. ఈ పోస్టుపై కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే స్పందించారు. బెంగళూరులో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. మౌలిక సదుపాయాలకు అవసరమైనవన్నీ చేస్తున్నామన్నారు.