Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యాచారాలకు కేర్ ఆఫ్ అడ్రెస్‍‌గా మారిపోతున్న ఢిల్లీ.. కేజ్రీవాల్, నరేంద్ర మోడీ పట్టించుకోరా?

నిర్భయ లాంటి ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినా.. ఢిల్లీ అత్యాచారాలకు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా మారిపోయింది. బాలికలు, యువతులు, మహిళలు అని వయోభేదం లేకుండా దేశ రాజధాని నగరమైన ఢిల్లీ అత్యాచారాలకు నిలయం మారి

అత్యాచారాలకు కేర్ ఆఫ్ అడ్రెస్‍‌గా మారిపోతున్న ఢిల్లీ.. కేజ్రీవాల్, నరేంద్ర మోడీ పట్టించుకోరా?
, సోమవారం, 19 డిశెంబరు 2016 (16:31 IST)
నిర్భయ లాంటి ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినా.. ఢిల్లీ అత్యాచారాలకు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా మారిపోయింది. బాలికలు, యువతులు, మహిళలు అని వయోభేదం లేకుండా దేశ రాజధాని నగరమైన ఢిల్లీ అత్యాచారాలకు నిలయం మారిపోతోంది. మహిళలపై అఘాయిత్యాలు జరిగే నగరాల్లో ఢిల్లీ టాప్‌లో ఉంది. ఢిల్లీ  నగరాన్ని కామాంధులు అనే చీడపురుగులు పట్టేసుకున్నాయి. 
 
దేశ రాజధాని ఢిల్లీలో గత 2016 మార్చిలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. కనాట్‌ ప్లేస్‌ సమీపంలో ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్లో అమెరికాకు చెందిన ఓ యువతిపై ఐదుగురు దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితుల్లో "టూరిస్ట్‌ గైడ్‌" ఉన్నాడు. గత మార్చిలో జరిగిన ఈ దారుణం గురించి బాధితురాలు ఈమెయిల్‌ ద్వారా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన తర్వాత ఢిల్లీకి వచ్చి వాంగ్మూలం ఇస్తానని పేర్కొంది.
 
ఢిల్లీలో పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వచ్చిన ఆమె టూరిస్ట్ గైడ్‌తో పాటు నలుగురి చేతిలో అత్యాచారానికి గురైంది. హోటల్‌ రూమ్‌‌లో ఉన్న సమయంలో రూట్‌ ప్లాన్‌ గురించి మాట్లాడాలంటూ గైడ్‌ మరో నలుగురితో కలసి ఆమె బస చేసిన రూములోకి వచ్చాడు. అతను అప్పటికే మద్యం సేవించి ఉన్నాడని, అతనితో పాటు మరో నలుగురు గదిలోకి వచ్చి డోర్ లాక్ చేశారని తెలిపింది. 
 
ఆ తర్వాత ఆమెకు బలవంతంగా డ్రింక్ తాగించి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది. ఈ దారుణం జరిగిన తర్వాత బాధితురాలు వెంటనే భారత్‌ నుంచి అమెరికా వెళ్లిపోయింది. కుటుంబీకులకు ఈ విషయాన్ని దాచిపెట్టి.. లాయర్‌‍ను సంప్రదించి.. ఢిల్లీ పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. 
 
ఇలా రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్న అత్యాచారాలను నివారించడంలో ఢిల్లీలోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ప్రజలు వాపోతున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రజలు మండిపడుతున్నారు. పనికి రాని రాజకీయాలను పక్కనబెట్టి పరిపాలనలో ఉన్న ఢిల్లీ మహానగరాన్ని, ఆకాశంలో సగమున్న మహిళలు జీవించేందుకు ఆవాసయోగ్యం చేయండని హితవు పలుకుతున్నారు. 
 
కాలుష్యం, పొగమంచుతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న మహిళలకు కామాంధులతో రక్షణ కరువైందని, మహిళల రక్షణకు, భద్రతకు భంగం లేకుండా చేస్తే వారూ ధైర్యంగా ఉండే పరిస్థితి కల్పిస్తే మంచిదంటున్నారు. ఢిల్లీలో పురుషులు కామాంధులుగా రెచ్చిపోతుంటే.. స్వదేశీ, విదేశీ మహిళలకు క్షేమం కాదనే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలని ఢిల్లీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
మరి ప్రజల గోడును ప్రభుత్వాలు పట్టించుకుంటాయో.. లేదో తెలియదు కానీ.. కేజ్రీవాల్ మహిళల రక్షణ కోసం ఓ ఉద్యమాన్ని లేవనెత్తి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ఉద్యమంలోకి లాగితే మాత్రం.. ఆయనకు 50శాతం మహిళల ఓట్లు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనా బలగాలు దోచుకున్న డ్రోన్ మాకు అవసరం లేదు.. మీరే ఉంచుకోండి: ట్రంప్