Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త వ్యవసాయ చట్టాలు రైతులను సంకెళ్ల నుంచి విముక్తి చేస్తాయి : ప్రధాని మోడీ

కొత్త వ్యవసాయ చట్టాలు రైతులను సంకెళ్ల నుంచి విముక్తి చేస్తాయి : ప్రధాని మోడీ
, ఆదివారం, 29 నవంబరు 2020 (15:19 IST)
తన సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతులను సంకెళ్ల నుంచి విముక్తులను చేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. రైతుల కష్టాలను, సమస్యలను తగ్గించే చట్టాలను తాము తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. 
 
ప్రతి నెలా ఆయన జాతినుద్దేశించి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. నవంబరు 29వ తేదీ ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఇందులో రైతుల నడ్డి విరుస్తాయని ఓ వైపు ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో రైతులకు కొత్త వ్యవసాయ చట్టాలపై నమ్మకం కలిగించేందుకు ప్రయత్నించారు. 
 
దేశంలో వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు నూతన కోణం ఆవిష్కృతమైందన్నారు. వ్యవసాయ సంస్కరణలు కొద్ది రోజులుగా రైతులకు నూతన అవకాశాల తలుపులను తెరుస్తున్నాయని చెప్పారు. రైతులు ఈ చట్టాలతో సాధికారులయ్యారని తెలిపారు. 
 
కష్టపడి పని చేసే భారతీయ రైతుల సంక్షేమానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. యువత, వ్యవసాయ విద్యార్థులు తమ సమీపంలోని గ్రామాలకు వెళ్లి, రైతులకు నూతన వ్యవసాయ చట్టాలు, సంస్కరణల గురించి తెలియజేయాలని కోరారు. 
 
కాగా, ఈ కొత్త అగ్రి చట్టాల్లో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి సంబంధించి అంశం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. విపక్షాలు కూడా ఇదే మాటను పదేపదే చెబుతున్నాయి. తాము పండించిన పంటను వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 
 
పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీలో నిరసన తెలిపేందుకు 'ఢిల్లీ ఛలో' మార్చ్ నిర్వహిస్తున్నారు. వీరితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటికే కొన్ని రైతు సంఘాలతో చర్చలు ప్రారంభించగా, హోం మంత్రి అమిత్ షా కూడా తాము చర్చలకు సిద్ధమేనని ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పట్టువీడని రైతులు.. మెట్టు దిగని సర్కారు : అమిత్ షా ఆఫర్ తిరస్కృతి