Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్మశానంలో శవాలకు పెళ్లి చేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ.. ఎందుకు?

శ్మశానంలో శవాలకు పెళ్లి చేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ.. ఎందుకు?
, బుధవారం, 4 ఆగస్టు 2021 (10:29 IST)
ఓ యువజంట ప్రాణాలు తీసుకుంది. తమ ప్రేమ పెళ్లికి పెద్దలు సమ్మతించలేదు. దీనికి కారణం ఆ ప్రేమికులిద్దరికీ ఒకే గోత్రం కావడమే. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒకరికి ఒకరు విడిచి ఉండలేక ఆ జంట బలవంతంగా ఆత్మహత్య చేసుకుంది. పిల్లల మరణం తర్వాత వారి ప్రేమ విలువను గుర్తించిన పెద్దలు శ్మశానంలో వారిద్దరి మృతదేహాలకు వివాహం జరిపించి ఖననం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో ఆదివారం చోటు చేసుకుంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆత్మహత్య చేసుకున్న యువకుడి పేరు ముఖేష్ సోనావనే(22). యువతి పేరు నేహా థాక్రే(19). ఇద్దరూ పలాడ్ గ్రామానికి చెందిన వారు. నేహ కుటుంబం కొన్ని నెలలుగా వేడ్ గ్రామంలోని బంధువు ఇంట్లో ఉంటోంది. ముఖేష్, నేహా ఇద్దరూ మనస్ఫూర్తిగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. 
 
ఈ విషయాన్ని ముఖేష్ తన తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించాడు. అయితే నేహ వాళ్ల అమ్మా, నాన్న మాత్రం దీనికి సమ్మతించలేదు. ఇద్దరూ ఒకే గోత్రానికి చెందిన వాళ్లు కావడం వల్ల ఈ పెళ్లికి తాము అంగీకరించమని తేల్చి చెప్పేశారు. 
 
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ముఖేష్, నేహ.. పెద్దలు ఇక తమ వివాహం జరిపించరని నిర్ణయానికి వచ్చి ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తమ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని తెలియడంతో ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపించాయి. 
 
పోలీసులు మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాల వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలిపారు. ఈ క్రమంలోనే అంత్యక్రియల సమయంలో ఇరు కుటుంబాలు తమ బిడ్డల కోరిక మేరకు వారి మృతదేహాలకు శ్మశానంలో పెళ్లి తంతు నిర్వహించి ఒక్కటి చేశారు. అనంతరం ఇద్దరినీ ఖననం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొనసాగుతున్న కరోనా విజృంభణ : మరో 42 వేల పాజిటివ్ కేసులు