Publish Date: Thu, 04 Apr 2019 (15:35 IST)
Updated Date: Thu, 04 Apr 2019 (15:36 IST)
భారతదేశంలో పులుల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతున్న తరుణంలో మహారాష్ట్రలో మరో 5 చిరుతపులి పిల్లలు సజీవదహనమయ్యాయి. అయితే ప్రమాదవశాత్తూ ఇవి చనిపోయాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని అంబేగామ్ తాలూకా గావడీవాడీ గ్రామంలో గోపినాథ్ గునాగే అనే వ్యక్తికి చెరకు తోట ఉంది.
అయితే చెరుకు కోసేందుకు నిన్న ఉదయం ఆరు గంటలకు కూలీలు వచ్చి కోత మొదలుపెట్టారు. ఆ సమయంలో వారికి ఒక అత్యంత విషపూరితమైన పాము కనిపించింది. ఆ పామును చంపేందుకు కూలీలు తోటకు నిప్పంటించారు.
మంటలు ఆరాక పాము కోసం వెతుకుతున్న సమయంలో వారికి 15 రోజుల వయసున్న చిరుతపులి పిల్లల కబేళాలు కనిపించాయి. పాము కోసం పెట్టిన మంటలో రెండు మగ మూడు ఆడ చిరుత పిల్లలు చనిపోయాయని గుర్తించారు.
ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో వారు వచ్చి చిరుతపులి పిల్లల కళేబరాలకు పోస్ట్ మార్టం చేయించి వాటిని పూడ్చి పెట్టారు. పులి పిల్లలు సజీవదహనమైన నేపథ్యంలో ఆ పెద్ద పులి గ్రామ ప్రజలపై దాడిచేసే అవకాశముందని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.