మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తన ఇల్లంతా మనవరాళ్ళతో నిండిపోయిందని, ఇంట్లో ఉన్నపుడల్లా తనకు ఓ లేడీస్ హాస్టల్గా ఉందని, తాను వారికి వార్డెన్గా ఉంటున్నానని చిరంజీవి అన్నారు. తన కుమారుడు రామ్ చరణ్కు కొడుకు పుట్టి తమ వారసత్వాన్ని కొనసాగించాలనే కోరిక ఉన్నట్టు, అందుకే ఈసారి చరణ్ను ఓ కొడుకును కనురా అని అడుగుతుంటానని, మళ్లీ అమ్మాయని కంటాడేమోననే భయం కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు.
అయితే, వారసత్వం కోసం ఓ మగబిడ్డను కనమని చెర్రీని అడుగుతుంటానని చిరు చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమల్లో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలను ఇప్పటికే పలువురు ఖండించారు. తాజాగా ఆయన వ్యాఖ్యలపై మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ స్పందించారు. కూతుళ్లు కూడా వారసులేనన్న విషయాన్ని నమ్మండి, గుర్తించండి అని ఆమె హితవు పలికారు.
"చిరంజీవిగారూ, దయచేసి కూతురు కూడా ఒక వారసురాలేనని నమ్మడం, గుర్తించడం ప్రారంభించండి. ఇదంతా మీరు కూతురిని ఎలా పెంచుతారు, ఆమె ఎలా అభివృద్ధి చెందుతుంది అనే దానిపై ఆధారపడివుంటుంది. తమ కుమార్తెలను పెంచి, తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న తల్లిదండ్రులను నుంచి నేర్చుకోండి. వారిని బాగా చూసుకుంటే వారు తమ కుటుంబాలను గర్వపడేలా చేస్తారు. ఇప్పటికే చాలా మంది ఈ విషయాన్ని నిరూపించారు. అమ్మాయిలేం తక్కువ కాదు" అని కిరణ్ బేడీ ట్వీట్ చేశారు.