Publish Date: Wed, 03 Aug 2022 (13:02 IST)
Updated Date: Wed, 03 Aug 2022 (13:07 IST)
కేరళలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కేరళలోని ఏడు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఆ జాబితాలో తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాలు ఉన్నాయి. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు జిల్లాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి.
భారీ వర్షాల నేపథ్యంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిందని కేరళ సీఎం పినరయి విజయన్ చెప్పారు.
ఈ క్రమంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల నుంచి, వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు సీఎం విజయన్ తెలిపారు.
రుతుపవన కాలంలో సంభవించే భారీ వర్షాలు, వరదలను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో ముందస్తుగా అంచనాలు, మాక్ డ్రిల్లు, సమావేశాలు నిర్వహించడం ద్వారా అవసరమైన సన్నాహాలు ప్రారంభించిందని తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో.. ఎర్నాకులం, తిరువనంతపురం జిల్లాల్లో ఇప్పటికే పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.