చెరువును శుభ్రం చేస్తుండగా, ఓ రైతు చేయిని చేప ఒకటి కొరికింది. దీంతో వైద్యులు ఆయన అరచేతిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేప కొరకడం వల్ల గ్యాస్ గ్యాంగ్రీన్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు. ఈ తరహా బ్యాక్టీరియా లక్ష మందిలో ఒకరిద్దరికి మాత్రమే సోకే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఇది మెదడుకు వ్యాపిస్తే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించిన వైద్యులు... చివరకు ఆ రైతు అరచేతిని తొలగించారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఈ ఘటన నిజంగానే జరిగింది. కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లా థలస్సెరికి చెందిన రైతు టి.రాజేశ్ (38) గత నెల 10వ తేదీన తన పొలంలోని చేపల చెరువును శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలో "కడు" అనే రకం చేప ఒకటి ఆయన చేతిని కొరకడంతో చేతి వేలికి గాయమైంది. ఆ వెంటనే ఆస్పత్రికి వెళ్లి గాయానికి వైద్యం చేయించుకున్నాడు. గాయం ఎంతకీ తగ్గకపోవడంతో పలు రకాలైన వైద్యాలు చేయించాడు.
అయినా ఫలితం లేకపోగా, బొబ్బలు వచ్చాయి. దీంతో మరోమారు ఆస్పత్రికి వెళ్తే వైద్యుల రకరకాలైన వైద్య పరీక్షలు చేసి, గ్యాస్ గ్రాంగ్రీన్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినట్టు నిర్ధారించారు. దాని నుంచి బయటపడాలంటే వ్యాధి వ్యాపించిన భాగాన్ని తొలగించడం తప్ప మరోమార్గం లేదని వైద్యులు తేల్చిచెప్పారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి అరచేతిని పూర్తిగా తొలగించారు.
ఇసుక, బురద నీటిలో కనిపించే క్లోస్ట్రిడియం పెర్పింజెన్స్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్యులు వెల్లడించారు. ఈ బ్యాక్టీరియా కనుక మెదడుకు వ్యాపిస్తే ప్రాణాలకే ప్రమాదమని అందుకే ముందు జాగ్రత్త చర్యగా అరచేతిని పూర్తిగా తొలగించినట్టు వైద్యులు వివరించారు. లక్షల మందిలో ఒకరిద్దరికి మాత్రమే ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిపారు. కేరళలో ఈ వ్యాధి ఇద్దరికి సోకగా అందులో రాజేశ్ ఒకరు కావడం గమనార్హం.