కర్నాటక రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేసే మహిళలకు ఒక రోజు వేతనంతో కూడిన నెలసరి సెలవు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.
ఈ కొత్త విధానం ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలతో పాటు జౌళి, ఐటీ, బహుళజాతి కంపెనీలు సహా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు సంస్థల్లోని మహిళా సిబ్బందికి వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళా ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సును పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
వారికి మద్దతుగా నిలుస్తూ, ప్రోత్సాహకరమైన పని వాతావరణాన్ని సృష్టించడమే తమ లక్ష్యమని పేర్కొంది. మహిళల శారీరక, మానసిక ఆరోగ్యంపై సమాజంలో అవగాహన పెంచేందుకు కూడా ఇది దోహదపడుతుందని వివరించింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంతో మంది మహిళలు ప్రయోజనం పొందుతారని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్.కె.పాటిల్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దేశంలోని బిహార్, కేరళ, ఒడిశా, సిక్కిం వంటి రాష్ట్రాలు మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో కర్ణాటక కూడా చేరింది.