Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వయనాడ్‌లో ఘోర ప్రమాదం... తొమ్మిది మంది మృతి

car accident
, శుక్రవారం, 25 ఆగస్టు 2023 (20:11 IST)
కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపు 25 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్లాంటేషన్‌ కార్మికులతో వెళ్తున్న ఈ జీపు తళప్పుఝాలోని కన్నోత్‌ హిల్‌ వద్ద ప్రమాదానికి గురైంది. పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. 
 
ప్రాథమిక సమాచారం ప్రకారం మృతులంతా వయనాడ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటన సమయంలో డ్రైవర్‌తో పాటు మొత్తం 13 మంది జీపులో ఉన్నారు. క్షతగాత్రులను వయనాడ్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్యను జిల్లా వైద్య అధికారి నిర్ధారించారు. ఈ ప్రమాదంలో జీపు నుజ్జునుజ్జయింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
 
ఈ దుర్ఘటనపై సీఎం పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనా స్థలానికి వెళ్లాలని అటవీశాఖ మంత్రి ఏకే శశీంద్రన్‌ను ఆదేశించారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారని సీఎంవో తెలిపింది. మరోవైపు, ఈ ఘటనపై వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడానని.. త్వరగా స్పందించాలని కోరినట్టు చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన రాహుల్‌.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గ్రీస్ పురస్కారం