శేఖర్ రెడ్డిని పట్టించిన శశికళ.. రామ్మోహన్ రావును గుట్టు వెల్లడించిన శేఖర్ రెడ్డి!
తితిదే పాలక మండలి మాజీ సభ్యుడు, ఇసుక కాంట్రాక్టర్ జే.శేఖర్ రెడ్డి ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేసి భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్ట
తితిదే పాలక మండలి మాజీ సభ్యుడు, ఇసుక కాంట్రాక్టర్ జే.శేఖర్ రెడ్డి ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేసి భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే ఈ దాడులకు సూత్రధారి ఎవరు అనే ప్రశ్నపై ఉపుడు ఆసక్తికర చర్చ సాగుతోంది.
వాస్తవానికి జే.శేఖర్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి జయలలిత, తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వంకు అత్యంత సన్నిహితుడు. నమ్మినభంటు. జయలలిత మరణించిన తర్వాత ఈయన పరిస్థితి రాత్రికి రాత్రే మారిపోయింది. జయలలిత ప్రియ నెచ్చెలి శశికళ చేతుల్లోకి అధికారం రాగానే ఆమె మొదట నిర్ణయించుకున్న టార్గెట్ జే.శేఖర్ రెడ్డి.
శశికళ వర్గీయులు ఇచ్చిన సమాచారంతో శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేసి భారీ మొత్తంలో నగదు, నగలు, బంగారం, కీలక దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయనతో పాటు ఆయన సన్నిహితులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అప్పటివరకు నోరు తెరవని శేఖర్ రెడ్డి.. విచారణలో అన్ని విషయాలు పూసగుచ్చినట్టు వివరించారు. రూ.కోట్ల మేరకు పాత నోట్లను కొత్త కరెన్సీగా మార్చిన వ్యాపారి, తనకు సహకరించిన బ్యాంకు అధికారుల పేర్లను కూడా చెప్పేశాడు.
పనిలోపనిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్ రావుకు తనకు ఉన్న సంబంధాలు, వ్యాపార లావాదేవీలను చెప్పారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం అనుమతితో రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ అధికారులు ఏకకాలంలో 13 చోట్ల దాడులు నిర్వహించి కోట్లాది రూపాయల అక్రమాస్తులను స్వాధీనం చేసుకున్నారు. మున్ముందు కూడా మరికొందరి ఇళ్ళపై ఐటీ అధికారులు దాడులు జరిపే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.