Publish Date: Fri, 19 Mar 2021 (10:02 IST)
Updated Date: Fri, 19 Mar 2021 (10:03 IST)
తమిళనాడులో ఎన్నికల వేళ డిఎంకె అభ్యర్థి బందువుల నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటి) దాడులు జరుపుతోంది. తిరుప్పూరు జిల్లా తారాపురం నియోజకవర్గంలో డిఎంకె తరఫున కయల్విళి సెల్వరాజ్ పోటీ చేస్తున్నారు.
ఆ నియోజకవర్గంలో ఆయనకు మద్దతుగా డిపిఐ, ఎండిఎంకె, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆ ప్రాంతంలోని ఎండిఎంకె నేత కవిన్ నాగరాజ్, ఆయన సోదరుడు మక్కల్ నీదిమయ్యం కోశాధికారి చంద్రశేఖర్, డిఎంకె నేత ధనశేఖర్ నివాసాలు, వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో ఐటి అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపారు.
రెండు రోజులు నిర్వహించిన సోదాల్లో రూ.8 కోట్ల నగదు పట్టుబడినట్లు అధికారులు ప్రకటించారు. పన్నుల ఎగవేతకు సంబంధించి కీలకమైన పత్రాలు లభించాయని అన్నారు.
ఐటి దాడులపై డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్, టిఎన్సిసి అధ్యక్షుడు అళగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను భయపెట్టేందుకే కేంద్రం ఈ ఐటి శాఖను ప్రయోగించిందని మండిపడ్డారు.