Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాబిల్లి ఉపరితలంపై ఉష్ణోగ్రత ఎంతంటే... వెల్లడించిన ఇస్రో

chandrayaan graph
, ఆదివారం, 27 ఆగస్టు 2023 (19:13 IST)
చంద్రుడి దక్షిణ ధృవం అధ్యయనం కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం తన పనిని ప్రారంభించింది. ఈ విషయాన్న ఇస్రో వెల్లడించింది. ఈ క్రమంలో ఈ మిషన్‌కు సంబంధించి తొలి శాస్త్రీయ పరిశోధన వివరాలను ఇస్రో ఆదివారం బహిర్గతం చేసింది. విక్రమ్ ల్యాండర్‌లోని 'చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్' పేలోడ్.. చందమామ ఉపరితలంపై కాస్త లోతులో సేకరించిన ఉష్ణోగ్రతల గణాంకాలను గ్రాఫ్ రూపంలో విడుదల చేసింది. 
 
'చాస్టే పేలోడ్.. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద నేల పైపొర ఉష్ణోగ్రతలను లెక్కిస్తుంది. తద్వారా జాబిల్లి ఉపరితల థర్మల్ ధర్మాలను అర్థం చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. నేలపై 10 సెంటిమీటర్ల లోతువరకు చొచ్చుకెళ్లి, ఉష్ణోగ్రతలను లెక్కించే సామర్థ్యం ఈ పేలోడ్‌కు ఉంది. దీనికి 10 సెన్సర్లు అమర్చి ఉన్నాయి' అని ఇస్రో పేర్కొంది. 
 
చంద్రుడి ఉపరితలంపైన, కాస్త లోతులో నమోదైన ఉష్ణోగ్రత వైవిధ్యాలు సంబంధిత గ్రాఫ్‌లో కనిపిస్తున్నట్లు చెప్పింది. గ్రాఫ్ ప్రకారం.. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత సుమారు 50 డిగ్రీలుగా ఉంది. అదే 80 మిల్లీమీటర్ల లోతులో దాదాపు -10 డిగ్రీలుగా చూపిస్తోంది.
 
చంద్రుడి దక్షిణ ధృవంలో ఉష్ణోగ్రతలకు సంబంధించి ఇది మొదటి వివరాలు అని ఇస్రో వెల్లడించింది. పూర్తిస్థాయి పరిశీలనలు జరుగుతున్నాయని చెప్పింది. ఇదిలావుంటే, ల్యాండర్ మాడ్యుల్లోని రాంభా, చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పరిమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ పేలోడ్లను గురువారమే ప్రారంభించిన విషయం తెలిసిందే. 'చంద్రయాన్-3' మిషన్ ఇప్పటికే తన రెండు లక్ష్యాలను పూర్తి చేసుకున్నట్లు ఇస్రో తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంచలనం రేపుతున్న విద్యార్థిని రితీసాహు మృతి కేసు