Publish Date: Wed, 25 Mar 2026 (14:10 IST)
Updated Date: Wed, 25 Mar 2026 (14:14 IST)
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపధ్యంలో ప్రజలు అప్రమత్తతో వుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి చెప్పిన మాటలను కొంతమంది అపార్థం చేసుకున్నారు. ప్రధానమంత్రి లాక్ డౌన్ అంటూ ప్రకటించారంటూ పుకార్లు పుట్టిస్తున్నారు. వాస్తవానికి ప్రధానమంత్రి మోదీ మార్చి 2026లో లాక్డౌన్ను ప్రకటించలేదు. ప్రపంచ దేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి సరఫరా గొలుసు సమస్యలు, మధ్యప్రాచ్య సంఘర్షణపై చర్చల సందర్భంగా 2020 కోవిడ్ మహమ్మారిని గుర్తుచేస్తూ ఆయన చేసిన ప్రసంగాన్ని అపార్థం చేసుకోవడం వల్ల లాక్డౌన్కు సంబంధించిన వైరల్ ట్రెండ్లు, సెర్చ్లు పుట్టుకొచ్చాయి.
ప్రధాని మోదీ ఏం చెప్పారంటే... లాక్డౌన్ను ప్రకటించలేదు, ప్రస్తుత సంఘర్షణల కారణంగా, కోవిడ్-19 సమయంలో ప్రపంచ సరఫరా గొలుసులకు ఏర్పడిన అంతరాయాల మధ్య సారూప్యతలను చూపి, సన్నద్ధత మరియు ఐక్యతకు పిలుపునిచ్చారు. దాన్ని అర్థం చేసుకోవడంలో తలెత్తిన సమస్యతో అది కాస్తా లాక్ డౌన్ అంటూ పుకార్లు చెలరేగాయి. దీనితో ప్రజలు గ్యాస్, ఆయిల్ కోసం ఎగబడుతున్నారు. వాస్తవానికి అటువంటి కొరత ఏమీలేదు. కాకపోతే కొద్దిగా జాప్యం జరుగుతుంది అంతే. కనుక ప్రజలు ఇటువంటి పుకార్లను నమ్మవద్దని ఆయిల్ కంపెనీలు విజ్ఞప్తి చేస్తున్నాయి.