శుక్రవారం నాడు ఉదయం చెన్నై నుంగంబాకం రైల్వే స్టేషన్లో ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని అత్యంత దారుణంగా నరికి చంపిన నిందితుడి ఊహా చిత్రాన్ని చెన్నై పోలీసులు శనివారం నాడు విడుదల చేశారు. సీసీ టీవీ కెమెరాల్లో చిక్కిన అతడి ఊహా చిత్రాన్ని పోలీసులు రిలీజ్ చేశారు. యువతి పీక కోసి తాపీగా వెళ్లిపోయిన నిందితుడి ఆచూకి కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. అతడిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపింది.
వాడేం చేస్తాడులే అని అనుకోవడమే ఆమె చేసిన తప్పు. ఆమె అతడి వార్నింగులను లైట్గా తీసుకోవడం వల్ల ప్రాణాలను కబళించాడు ఆ దుండగుడు. చెన్నై నుంగబాక్కం రైల్వే స్టేషనులో పట్టపగలు అందరూ చూస్తుండగా నల్ల ప్యాంటు ధరించిన ఓ దుండగుడు చెన్నై ఇన్పోసిస్లో పనిచేస్తున్న స్వాతి అనే 24 ఏళ్ల యువతిని పీక కోసి అత్యంత కిరాతకంగా హతమార్చాడు.
క్రిక్కిరిసిన రైల్వే స్టేషనులో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేస్తున్నా అంతా అలా చూస్తూ ఉండిపోయారు. తేరుకునేసరికి దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా ఇదే వ్యక్తి స్వాతితో గత వారం తీవ్రంగా వాదనకు దిగినట్లు తెలిసింది. అతడు ఓ క్యాబ్ డ్రైవర్ అని తెలుస్తోంది. మరి అతడే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా లేదంటే మరెవరైనా చేశారా అన్నది తేలాల్సి ఉంది. అతడు స్వాతికి తెలిసినవాడై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాతి బంధువులను, ఇతర స్నేహితులను విచారిస్తున్నారు.
కాగా తమ ఉద్యోగి దారుణ హత్యపై ఇన్ఫోసిస్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. దర్యాప్తుకు తాము పూర్తిగా సహకరిస్తామనీ, దుండగుడిని కఠినంగా శిక్షించాలని తెలిపింది.