ఓ ప్రయాణికురాలికి అపరిశుభ్రమైన, అసౌకర్యవంతమైన సీటును కేటాయించినందుకు ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో విమానయాన సంస్థకు ఢిల్లీ వినియోగదారుల ఫోరం కోర్టు అపరాధం విధించింది. రూ.1.5 లక్షల జరిమానాను సదరు ప్రయాణికురాలికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
గత జనవరి నెల 5వ తేదీన తాను ప్రయాణించిన బాకు - న్యూఢిల్లీ ఇండిగో విమానంలో తనకు అపరిశుభ్రమైన సీటను కేటాయించినట్టు పింకీ అనే మహిళా ప్రయాణికురాలు ఢిల్లీలోని వినియోగదారుల ఫోరం కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనివల్ల తాను శారీరకంగా, మానసికంగా ఇబ్బందిపడినట్టు తెలిపింది. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిషన్ ప్రయాణికురాలు ఎదుర్కొన్న అసౌకర్యం, మానసిక వేదనకు పరిహారం చెల్లించాలని ఇండిగో సంస్థను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ఆమె ఖర్చు చేసిన రూ.25 వేలు కూడా చెల్లించాలని పేర్కొంది.
అయితే, ఈ ఆదేశాలను ఇండిగో సంస్థ వ్యతిరేకించింది. ప్రయాణికురాలికి కేటాయించిన సీటు సరిగ్గా లేకపోవడంతో ఆమె అభ్యర్థన మేరకు తాము వేరే సీటును కేటాయించి, ఆమె ప్రయాణం సాఫీగా పూర్తయ్యేలా చేసినట్టు తెలిపింది. అయితే, వినియోగదారుల ప్రయాణ సమాచారాన్ని తెలిపే అంతర్గత కార్యాచరణ రికార్డులో భాగమైన సిట్యుయేషన్ డేటా డిస్ ప్లే (ఎస్.డి.డి.) నివేదిక సమర్పించడంలో ఎయిర్లైన్స్ విఫలం కావడంతో జరిమానాను చెల్లించాల్సిందేనంటూ ఆదేశించింది.