సుంకాల మోతతో భారత్కు అమెరికా షాకిచ్చింది. దీనికి భారత్ ధీటుగా స్పందించింది. అమెరికా నుంచి ఆయుదాలు, యుద్ధ విమానాల కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ రాయటర్స్ పత్రిక ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. అంతేకాకుండా, యుద్ధ ఆయుధాలు, పరికరాల కొనుగోళ్లకు సంబంధించి త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్లాల్సిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య వార్ ట్రేడ్ మొదలేంది.
రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇటీవల భారత్పై 25 శాతం అదనపు సుంకాల భారం మోపిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్పై యుద్ధానికి భారత్ పరోక్షంగా ఫండింగ్ చేస్తోందంటూ డోనాల్డ్ ట్రంప్ నోరుపారేసుకున్నారు. ఏ వాణిజ్య భాగస్వామిపైనాలేని విధంగా భారత్పై ఏకంగా 50 శాతం సుంకాలను విధించారు. వాణిజ్య ఒప్పందంలో భారత్పై పైచేయి సాధించడానికిగానూ ట్రంప్ టారిఫ్ ఎత్తుగడ ప్రయోగిస్తున్నారని విశ్లేషణలు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఎంతదూరమైనా వెళుతామని, ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గబోమని స్పష్టం చేశారు. అదేసమయంలో ఎప్పటి నుంచో రష్యా నుంచి ఆయుధ కొనుగోళ్లు జరుపుతున్న భారత్.. అమెరికాతో సంబంధాల దృష్ట్యా ఆ దేశం నుంచీ కొనుగోళ్లు జరపాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా పర్యటన సందర్భంగా ఆయుధ కొనుగోళ్లు జరపనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు.
తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఆయుధ కొనుగోళ్లను నిలిపివేయాలని భారత్ నిర్ణయించినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. అయితే, కొనుగోళ్లు నిలిపివేతకు సంబంధించి లిఖితపూర్వక ఆదేశాలేవీ ఇవ్వలేదని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. భారత్పై అమెరికా ఒత్తిడి పెంచితే దానికి ధీటుగా బదులిచ్చేందుకు ఈ అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై భారత రక్షణ మంత్రిత్వ శాఖగానీ, పెంటగాన్గానీ స్పందించలేదని 'రాయిటర్స్' పేర్కొంది.