Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జైలుపాలయ్యారా.. దండిగా డబ్బుందా.. అయితే కొండమీద కోతి కూడా దిగొస్తుంది

డబ్బున్న మారాజులు, మారాణిలకు భారత దేశంలో జైళ్లు స్వర్గధామాలని, కోరిన కోరికలు అందులో తీర్చుకోవచ్చని నాలుగేళ్లు మన జైళ్లలో దర్జాగా బతికిన ప్రముఖ ఆయుధాల వ్యాపారి భార్య అంకా వర్మ స్పష్టం చేశారు.

జైలుపాలయ్యారా.. దండిగా డబ్బుందా.. అయితే కొండమీద కోతి కూడా దిగొస్తుంది
హైదరాబాద్ , శనివారం, 15 జులై 2017 (02:38 IST)
శశికళ తనకు కారాగారంలో సకల సౌకర్యాలు లభించేందుకు వీలుగా రూ. 2 కోట్లు జైలు అధికారులకు లంచం చెల్లించిందని, ఈ వ్యవహారంలో కర్ణాటక జైళ్లశాఖ డీజీపీ హెచ్‌ఎన్‌ సత్యనారాయణరావుకు సైతం ముడుపులు అందాయని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. జైళ్లశాఖ డీఐజీ రూప ఈ మేరకు తన నివేదికలో సంచలన విషయాలు వెల్లడించడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. కానీ వాస్తవం ఏమిటంటే డబ్బున్న మారాజులు, మారాణిలకు భారత దేశంలో జైళ్లు స్వర్గధామాలని, కోరిన కోరికలు అందులో తీర్చుకోవచ్చని నాలుగేళ్లు మన జైళ్లలో దర్జాగా బతికిన ప్రముఖ ఆయుధాల వ్యాపారి భార్య అంకా వర్మ స్పష్టం చేశారు. 
 
రొమానియా మాజీ సుందరి అయిన అంకా నియాక్స్ అలియాస్ అంకావర్మ ప్రముఖ ఆయుధాల వ్యాపారి అభిషేక్ వర్మ భార్య. భారత రక్షణ శాఖకు ఆయుధాలను, జలాంతర్గాములను సరఫరా చేయడంలో భారీగా ముడుపులు పుచ్చుకున్నారనే ఆరోపణలపై 2012లో ఇరువురిపై మూడు కేసులు నమోదయ్యాయి. అందులో ఒక కేసు ఆదిలోనే వీగిపోగా, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేసులు 2017, ఏప్రిల్‌ నెలవరకు కొనసాగాయి. ఈ కేసుల్లో 2016, మే 20వ తేదీన అంకా వర్మకు బెయిల్‌ లభించింది. అప్పటివరకు అంటే నాలుగేళ్లపాటు ఆమె జైల్లోనే గడిపారు. ‘నీకు డబ్బుంటే నీకు కావాల్సినదాన్ని పొందవచ్చు. నేనెప్పుడూ ఒకటే చెబుతాను, జైలనేది పేద ప్రజలకు మాత్రమే నరకం’ అని ఈమె చెబుతున్నారు. 
 
తీహార్‌ జైల్లో ఉన్న నాలుగేళ్లు అంకావర్మ జైలు బయట ఉన్నట్లే  దర్జాగా బతికారు. పది అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల వెడల్పు ఉన్న జైలు గదిలో కావల్సినంత ప్రైవసీని అనుభవించారు. జైలు గదిలోనే యూరోపియన్‌ కమోడ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఎలక్ట్రానిక్‌ ఏర్‌ బ్రష్‌ను వాడేవారు. రకరకాల సబ్బులు, షాంపోలతో శుభ్రంగా స్నానం చేసేవారు. జుట్టుకు రంగేసుకునేవారు. జెల్స్‌ను పూసుకునేవారు. కావాల్సిన ఆహార పదార్థాలను బయటి నుంచి తెప్పించుకునేవారు. కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్లినప్పుడు విహార యాత్రకు వెళ్లినట్లుగా బయటే ఇష్టమైన భోజనం చేసేవారు. జైలు గదిలో 14 అంగుళాల ఎల్‌సీడీ టీవీ ఉండేది, వాటిలో 29 శాటిలైట్‌ ఛానళ్లు వచ్చేవి.
 
తన అవసరాల కోసం ఎప్పుడూ లాయర్లకు, డాక్టర్లకు, జడ్జీలకు పిటిషన్లమీద పిటిషన్లు పెట్టుకునేవారు. ఓసారి రాష్ట్రపతికి కూడా పిటిషన్‌ను పెట్టుకున్నారు. జైలు మాన్యువల్‌లోని 6వ సెక్షన్, 30వ పేరా ప్రకారం కొన్ని సందర్భాల్లో బయటి నుంచి భోజనం, అవసరమైన దుస్తులు తెప్పించుకోవచ్చు. అయితే ములాకత్‌ సందర్భాల్లోనే తెప్పించుకోవాలి. డబ్బును ఎరగావేస్తే ఎన్నిసార్లయినా ములాకత్‌ల కుదురుతాయి. అందుకని అంకావర్మ తన జైలు గదిని వార్డ్‌రోబ్‌గా మార్చుకున్నారు. 
 
తాను రొమానియా మాజీ సుందరి అవడం వల్ల రకరకాల దుస్తులు ధరించి దర్జాగా తన భర్త అభిషేక్‌ వర్మతో కలసి కోర్టుల్లో కేసుల విచారణకు హాజరయ్యేది. తన దుస్తులు, తన అందం ద్వారా జడ్జీలను ఇంప్రెస్‌ చేయాలని కూడా ఆమె భావించారు. ఓ సందర్భంలో ‘జడ్జీలు నా దుస్తులు, అందం చూడకుండా కేసులు చూస్తారేం’ అని మీడియాతోని వ్యాఖ్యానించారు కూడా. ఆమె కోర్టు అనుమతితో మూడువేల రూపాయల బ్రాండెడ్‌ హైహీల్స్‌ చెప్పులను జైలుకు తెప్పించుకున్నారు.  2017, ఏప్రిల్‌ నెలలో సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంగా వారిద్దరిపై కేసులు కొట్టేశారు. 
 
ఇప్పుడు చెప్పండి జైలులో సమన్యాయం ఉందా.. జైళ్ల శాఖ అధికారులు పవిత్రులా.. అసలు జైళ్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదా..? ఈ దేశ ప్రజలను ఇలాంటి దౌర్భాగ్యపు అబద్ధాలతో, వంచనలతో ఎన్నాళ్లు వంచిస్తారు? 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడనే... డ్రగ్స్ తీసుకుంటానా.. వాపోయిన సుబ్బరాజు