Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ముఠా రంగంలోకి దిగితే బంగారం మాయం

ఆ ముఠా రంగంలోకి దిగితే బంగారం మాయం
, సోమవారం, 16 డిశెంబరు 2019 (06:04 IST)
రద్దీ ఎక్కువగా ఉండే బస్సులను ఎంచుకుని ఎక్కేస్తారు. వాటిలో ప్రయాణించే ఒంటరి మహిళలు, యువతులు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటారు. తమ వద్ద ఉన్న చిన్నపిల్లలను కావాలని ఏడిపించి వారికి అందజేయడమేగాక పాల సీసా అందించి తాగించాలని చెబుతారు. ముందు, వెనుక, చుట్టూ ముఠాకు సంబంధించిన వారు నిల్చొంటారు.

అవకాశం లభించగానే చేతివాటం ప్రదర్శించి సంచుల్లోని నగదు, ఆభరణాలను ఎవరో ఒకరు కొట్టేస్తారు. చిత్తూరు జిల్లా ఓజీ కుప్పం దొంగల ముఠా వ్యవహారమిది. ఆసిఫ్‌నగర్‌ పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. గాయత్రి అనే మహిళ నేతృత్వం వహిస్తున్న ఈ ముఠా నుంచి రూ.20 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు.

ఓజీ కుప్పంలో ఉంటున్న గాయత్రి, ఆమె భర్త రాజు, సోదరి కోకిల, మరదలు జ్యోతి ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారని..మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన వీరిని తొలిసారిగా పట్టుకున్నామని తెలిపారు.

ఈ ఏడాది జూన్‌లో పి.జయలక్ష్మి (69) అనే మహిళ సికింద్రాబాద్‌ నుంచి మెహిదీపట్నం వెళ్లేందుకు బస్సు ఎక్కింది. మెహిదీపట్నం వద్ద దిగి తన సంచిని చూసుకోగా అందులో 25 తులాల నగలు కనిపించలేదు. దీంతో ఆమె అదేరోజు లంగర్‌హౌస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడినుంచి ఈ దొంగల గురించి అన్వేషణ మొదలైందని తెలిపారు.
 
సీసీ కెమెరాలు.. సెల్‌ టవర్ల ఆధారంగా.. జయలక్ష్మి నుంచి దొంగలు ఆభరణాలను ఎప్పుడు దొంగలించారో స్పష్టత లేదు. నేరం జరిగిన ప్రాంతాన్ని ఉజ్జాయింపుగా గుర్తించి సీసీ కెమెరాలు, మహిళలెవరైనా బస్సు దిగారా? వారిలో ఎవరైనా ఫోన్‌ మాట్లాడారా? అని పరిశీలించగా ఒకచోట ఆధారాలు లభించాయి.

వెంటనే అక్కడ టవర్‌ డంప్‌ల నుంచి వివరాలు సేకరించారు. కొన్ని కర్ణాటకకు చెందిన చరవాణి నంబర్లు వచ్చాయి. వాటి ఆధారంగా బెంగళూరులోని తిమ్మప్ప గార్డెన్‌గా తేలింది. అక్కడికి వెళ్లగా నిందితులు మరోచోటకు వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు. చివరకు హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో ఉన్నట్టు సంకేతాలు రావడంతో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రతి రెండు నెలలకోసారి ఈ ముఠా ఓ నగరానికి వెళ్తున్నారని సంయుక్త కమిషనర్‌ ఎ.ఆర్‌.శ్రీనివాస్‌ తెలిపారు. అక్కడ ఖరీదైన హోటళ్లలో బస చేసి, 10, 15 రోజుల్లో కనీసం రూ.కోటి విలువైన ఆభరణాలు, నగదు కొట్టేస్తారు. నగలను అక్కడే విక్రయించి ఆ సొమ్ముతో బంగారు, వజ్రాభరణాల దుకాణాలకు వెళ్లి కొత్తవి కొంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిర్భయ చట్టంలో లొసుగులు: ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు