ప్రముఖ సముద్రతీర పర్యాటక ప్రాంతమైన గోవాలోని ఓ నైట్ క్లబ్లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది మృత్యువాతపడ్డారు. ఈ మృతుందరినీ గుర్తించారు. వీరిలో 20 మంది నైట్ క్లబ్ సిబ్బందే కావడం గమనార్హం. అలాగే, మరో ఆరుగురు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి గోవా ప్రభుత్వం నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది.
మరోవైపు, ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘోర విషాదానికి క్లబ్ యాజమాన్యం నిర్లక్ష్యం, అక్రమ నిర్మాణం, ఇరుకైన దారులే ప్రధాన కారణాలని ప్రాథమికంగా గుర్తించారు. పైగా, డ్యాన్స్ ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు బయటకు పరుగులు తీయగా, మరికొందరు వంట గదిలోకి వెళ్ళారు. అదే వారికి మృత్యుద్వారంగా మారింది. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఊపిరాటక క్లబ్ సిబ్బందితో పాటు పర్యాటకలు కూడా అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు.
ఈ ప్రమాదంపై ఫైర్ ఆఫీసర్ ఒకరు స్పందిస్తూ, ఈ క్లబ్కు వెళ్లే దారి చాలా ఇరుకుగా ఉండటంతో అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి 400 మీటర్ల దూరంలోనే నిలిచిపోయాయని తెలిపారు. దీంతో సహాయక చర్యలు చేపట్టడంలో జాప్యం జరిగిందన్నారు. పైగా, తాత్కాలికంగా తాటాకులతో నిర్మించిన కట్టడాలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని, ఇది కూడా ప్రమాద తీవ్రతకు ఒక కారణమని మరికొందరు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు.
మరోవైపు, ఈ ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గోవాకు ఇది అత్యంత బాధాకరమైన రోజని పేర్కొన్న వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై గోవా ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు.