పళని క్యాంప్లోని 20 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు: ఎమ్మెల్యేలకు శశికళ ఫోన్
సంఖ్యాపరంగా పళనిస్వామివైపే ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలు తమిళనాడు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఎవరికీ మద్దతివ్వబోమని ప్రకటించిన డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్.. ఉన్నట్లుండి పళనిస్వామికి వ్యతిరే
సంఖ్యాపరంగా పళనిస్వామి వైపే ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలు తమిళనాడు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఎవరికీ మద్దతివ్వబోమని ప్రకటించిన డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్.. ఉన్నట్లుండి పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించి హైడ్రామాకు తెరలేపారు. అమ్మ వ్యతిరేకులకు ఓటు వేయలేనంటూ... మైలాపూర్ ఎమ్మెల్యే, మాజీ డీజీపీ నటరాజన్ తాజాగా పన్నీర్ శిబిరంలోకి చేరారు. అమ్మ బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలు కుటుంబపాలనకు, విశ్వాసతీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని మాజనీ సీఎం పన్నీర్ సెల్వం విజ్ఞప్తి చేశారు.
కువత్తూరు క్యాంప్లో ఉన్న 20మంది ఎమ్మెల్యేలు తిరుగుబాట పట్టారన్న వార్తలు సంచలనం రేకెత్తించాయి. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు పళనిస్వామి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు జైలునుంచి శశికళ కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు రహస్య ఓటింగ్ డిమాండ్ చేస్తూ పన్నీర్ మద్దతుదారులు స్పీకర్కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్ రహస్య ఓటింగ్కు అనుమతిస్తే పరిస్థితులు మరింత ఉత్కంఠగా మారతాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. క్యాంపులో ఉన్నవారిలో పదిమంది పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేసినా పరిస్థితులు తారుమారవుతాయి.
దీంతో శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కాపాడుకుని బలపరీక్షలో సత్తా చాటేందుకు పళనిస్వామి వ్యూహాలు రచిస్తున్నారు. మరో పదిమందినైనా ఆకర్షించడంద్వారా పళనిస్వామి ప్రభుత్వాన్ని గద్దె దించి శశికళను దెబ్బ కొట్టాలని విపక్షాలు పథకాలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం జరుగనున్న బలపరీక్షలో విజయమెవరిదన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజాక్షేత్రంలో జయలలిత బొమ్మతో గెలుపొందిన ఎమ్మెల్యేలు అమ్మ నమ్మినబంటువైపు నిలుస్తారా చిన్నమ్మ నమ్మినబంటుకు ఓటేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.