కరూర్ బాధితులను నటుడు విజయ్ ఇటీవల చెన్నై ఈసీఆర్లోని ఓ హోటల్లో వారిని రప్పించి పరామర్శించారు. ఈ సందర్భంగా కరూర్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. వీరిలో చాలామంది విజయ్ అందించిన సాయం పొందారు. కానీ ఓ కరూర్ తొక్కిసలాట బాధితురాలు సంఘవి మాత్రం విజయ్ ఇచ్చిన రూ.20 లక్షలను తిరిగి పంపించి షాక్ ఇచ్చింది.
తొక్కిసలాటలో తన భర్త రమేష్ మృతిచెందినందుకు విజయ్ ఇచ్చిన రూ. 20 లక్షల పరిహారాన్ని ఆమె తిరిగి పంపింది. విజయ్ కరూర్లోని తమ వద్దకు రాలేదని.. మామల్లపురంలోని ఓ రిసార్ట్కు బాధితులను పిలిపించుకుని ఓదార్చడాన్ని ఆమె తప్పుబట్టింది.
అందుకే తాను పరిహారాన్ని వెనక్కు ఇస్తున్నట్లు తెలిపారు. వీడియో కాల్ ద్వారా తాను నేరుగా వచ్చి పరామర్శిస్తానని విజయ్ హామీ ఇచ్చారు. కానీ చెప్పినట్లు చేయలేదు. ఆయన పిలిచిన చోటుకు వెళ్లడం ఇష్టం లేదు. కానీ 20 లక్షలు పంపారు. తమకు డబ్బు ముఖ్యం కాదనే ఆ మొత్తాన్ని తిరిగి పంపినట్లు సంఘవి తెలిపింది.
ఇకపోతే.. సెప్టెంబర్ 27న కరూర్లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన దాదాపు నెల రోజుల తర్వాత అక్టోబర్ 27న టీవీకే అధినేత విజయ్.. బాధిత కుటుంబాలను వ్యక్తిగతంగా కలిసి ఓదార్చారు. అక్టోబర్ 18వ తేదీన కరూర్ బాధితుల ఖాతాల్లోకి రూ.20లక్షలను విజయ్ జమ చేశారు. అయితే విజయ్ నేరుగా పరామర్శించలేదని సంఘవి 20 లక్షల రూపాయలను తిరిగి పంపినట్లు మీడియాతో వెల్లడించింది.