ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే బహిరంగ సభకు హాజరయ్యే విద్యార్థులకు అంతర్గత (ఇంటర్నెల్) మార్కులు వేస్తారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. నిజ నిర్ధారణ విభాగం కూడా తోసిపుచ్చింది.
ఉత్తరాఖండ్లోని దేవ్ భూమి యూనివర్సిటీలో ఆదివారం జరుగనున్న కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆ సభకు హాజరైన విద్యార్థులకు పరీక్షల్లో అదనంగా 50 అంతర్గత మార్కులు వేస్తామని యూనివర్సిటీ జారీ చేసినట్లుగా ఉన్న ఓ నోటీసు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అందులో దేవ్ భూమి ఉత్తరాఖండ్ విశ్వవిద్యాలయానికి చెందిన అన్ని విభాగాల విద్యార్థులు ప్రధాని కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని.. దీనిని భారతీయ జ్ఞాన పరంపర (భారతీయ జ్ఞాన వ్యవస్థ) కోర్సు కింద పరిగణిస్తామని తెలిపారు. ఇందులో పాల్గొనే విద్యార్థులకు 50 అంతర్గత మార్కులు కేటాయిస్తామని వెల్లడించారు.
దేవ్ భూమి యూనివర్సిటీ నేడు జరగనున్న మోడీ కార్యక్రమంపై జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఈ అంశంపై సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వార్తలు తప్పని స్పష్టంచేసింది. దీనికి సంబంధించి యూనివర్సిటీ యాజమాన్యం ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్చెక్ విభాగం ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.
ఈ ప్రచారాలపై విశ్వవిద్యాలయం కూడా స్పందిస్తూ.. తమ యూనివర్సిటీ పేరిట జరుగుతున్న ప్రచారాలు నకిలీదని తేల్చిచెప్పింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నోటీసుపై సంబంధిత అధికారి సంతకం లేదని.. ఇటువంటి ప్రచారాలను ప్రజలు విశ్వసించ వద్దని కోరింది. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న ఖాతాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సుభాషిత్ గోస్వామి వెల్లడించారు.