పనామా పేపర్స్ తాజాగా విడుదల చేసిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ మోటపర్తి శివరామ వర ప్రసాద్ పేరు బయటపడిన నేపథ్యంలో పనామా పేపర్స్ స్కామ్లో భారతదేశానికి చెందిన 500 మంది ఉన్నట్లుగా అప్పట్లో ప్రచారం జరగటం తెలిసిందే. తాజాగా విడుదలైన పత్రాలతో పాటు.. భారతీయుల జాబితాను ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ బృందం మరో కొత్త జాబితాను విడుదల చేసింది. ఇందులో భారతీయులు 2వేల మంది ఉండటం గమనార్హం.
1046 మంది అధికారులు వ్యాపారులు సెలబ్రిటీలతో కూడిన వ్యక్తిగత సమాచారం పనామా పేపర్స్ బయటపెట్టింది. నగరాలు, పట్టణ ప్రాంతాలకు చెందిన వారే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారి అడ్రస్లను కూడా పనామా పేపర్స్ విడుదల చేసింది. తొలుత భారతీయులు 500 మంది ఉన్నట్లు ప్రకటించినా.. మొత్తంగా విడుదలైన పత్రాలతో ఈ సంఖ్య 2 వేలకు పెరగటం గమనార్హం.
పనామా పత్రాలతో కూడిన అతిపెద్ద డాటాబేస్ సోమవారం నుంచి ప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. సెర్చ్ఇంజిన్ సాయంతో ఆన్లైన్లో అన్వే, ఇంచుకునేందుకు వీలు చిక్కింది. అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిజం కన్సార్షియం (ఐసీఐజే) ఈ డాటాబేస్ను రూపొందించింది. పన్నుల ఎగవేత కోసం ఏర్పాటు చేసిన 2.14 లక్షల నకిలీ కంపెనీలు, వాటి వెనుక గల వ్యక్తుల బండారాన్ని ఇందులో పొందుపర్చారు. ఆసక్తి గలవారు ఎవరైనా సులభంగా దీనిలో తమకు కావాల్సిన సమాచారాన్ని అన్వేషించే ఏర్పాటు చేశారు.