వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని దుర్గాపూర్లో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సర విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. దీనిపై ఆమె స్నేహితుడుతో మరో ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో కోల్కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది ఇంకా మరిచిపోకముందే ఇపుడు బెంగాల్ రాష్ట్రంలోని దుర్గాపూర్లో అలాంటి ఘటనే జరిగింది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు.
కోల్కతా ఎయిర్పోర్టులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ఈ కేసులో నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బాధితురాలు ప్రైవేటు మెడికల్ కాలేజీలో విద్యాభ్యాసం చేస్తోంది. అర్థరాత్రి 12.30 గంటలకు అమ్మాయి బయటకు వచ్చింది అని ఆమె ప్రశ్నించారు. తనకు తెలిసినంతవరకు ఈ ఘటన అటవీ ప్రాంతంలో జరిగిందన్నారు. ఆ సమయంలో ఏం జరిగింతో తనకు పూర్తిగా తెలియదన్నారు.
దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందన్నారు. తీవ్ర దిగ్భ్రాంతి కలిగించేఘటన అని చెప్పారు. ఇటువంటి వాటిని తమ ప్రభుత్వం సహించదన్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని, దోషులను కఠినంగా శిక్షిస్తామని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.