Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జయలలిత అక్రమాస్తుల కేసు పూర్వాపరాలివి... శశికళ ముద్దాయి నం.2

తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని ఎంతగానో ముచ్చటపడిన వీకే. శశికళ నటాజన్‌కు సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళతో పాటు మిగిలిన ఇద్దరు నిందితులను దోషులుగా తేల్చ

జయలలిత అక్రమాస్తుల కేసు పూర్వాపరాలివి... శశికళ ముద్దాయి నం.2
, మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (12:17 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని ఎంతగానో ముచ్చటపడిన వీకే. శశికళ నటాజన్‌కు సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళతో పాటు మిగిలిన ఇద్దరు నిందితులను దోషులుగా తేల్చింది. జయలలిత మరణించడంతో ఈ కేసు నుంచి ఆమెను విముక్తి చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆమె రాజకీయ జీవితం శూన్యమైంది. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల సేకరింపు కేసును పరిశీలిస్తే.... 
 
1991-96 మధ్యకాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆదాయానికి మించి రూ.66 కోట్లకుపైగా ఆస్తులు సమీకరించుకున్నారని డీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి కె.అన్బళగన్ ప్రధాన ఆరోపణ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఇందులో జయలలితతో పాటు ఆమె స్నేహితురాలు శశికళ, ఆమె బంధువులు ఇళవరశి, వి.ఎన్‌.సుధాకరన్‌లు కూడా నిందితులుగా ఉన్నారు. 
 
1991-96 మధ్యకాలంలో జయలలిత అధికారంలో ఉన్నారు. 1996లో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయి డీఎంకే అధికారంలోకి వచ్చింది. అదే యేడాది జూన్‌ 14న సుబ్రమణ్యం స్వామి (ప్రస్తుతం బీజేపీ ఎంపీ) జయలలితపై ఫిర్యాదు చేశారు. డీఎంకే ప్రభుత్వం జయలలితపై కేసు నమోదు చేసింది. ఏడాది తర్వాత జయలలిత, శశికళ, ఇళవరశి, సుధాకరన్‌లపై ప్రత్యేక కోర్టు ఆదేశంతో చార్జిషీటు నమోదు చేశారు. 
 
1997లో జయలలిత నివాసంలో సోదాలు జరిపి 800 కిలోల వెండి, 28 కిలోల బంగారం, 750 జతల చెప్పులు, 10,500 చీరలు, 91 వాచీలు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని చెన్నైలోని రిజర్వు బ్యాంకు వాల్ట్‌‌లో భద్రపరిచారు. 
 
2001 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోయి అన్నా డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడంతో.. కేసు విచారణను తమిళనాడు వెలుపలకు బదిలీ చేయాలని 2003లో సుప్రీంకోర్టును కోరింది. దీంతో ఈ కేసును కర్ణాటకకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 
2014 సెప్టెంబర్‌ 27న తీర్పు చెప్పిన కర్ణాటక ప్రత్యేక కోర్టు.. అవినీతి నిరోధక చట్టంలోని 13(1)ఇ, 13(2) సెక్షన్ల కింద జయలలితను దోషిగా ప్రకటించింది. శశికళ, మిగతా ఇద్దరిని ఐపీసీలోని 120బి, 109 సెక్షన్ల కింద దోషులుగా నిర్ధారించింది. నలుగురికీ నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. జయలలితకు రూ.100 కోట్లు, మిగతా ముగ్గురిపై తలా రూ.10 కోట్ల చొప్పున అపరాధం కూడా విధించింది. 
 
ఆ తీర్పు వచ్చేటప్పటికి జయలలిత మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశంలో అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని దోషిగా నిర్ధారించి, జైలు శిక్ష వేయడం ఇదే తొలిసారి. ఈ తీర్పు ఫలితంగా జయ.. ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికీ అనర్హురాలయ్యారు. ఆ పదవులు కోల్పోయారు. కోర్టుకు హాజరైన జయలలితను తీర్పు వెలువడిన వెంటనే బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు. శశికళ సహా మిగతా ముగ్గురినీ ఇతర జైళ్లకు పంపారు.
 
ప్రత్యేక కోర్టు తీర్పుపై కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసిన జయ తదితరులు.. బెయిల్‌ కోసం సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. 2014 అక్టోబర్‌ 17వ తేదీన సుప్రీంకోర్టు నలుగురికీ బెయిల్‌ మంజూరు చేసింది. 2015 మే 11వ తేదీన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి సి.ఆర్‌.కుమారస్వామి.. విచారణ కోర్టు తీర్పును కొట్టివేశారు. జయలలిత, శశికళ సహా మిగతా ఇద్దరిపైనా అభియోగాలను రద్దుచేశారు. దీంతో జయలలిత అదే నెల 23వ తేదీన మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
 
జయ తదితరులను నిర్దోషులుగా విడుదల చేసిన కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును వేగంగా విచారించిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. జయలలిత 2016 డిసెంబర్‌ 5వ తేదీన మరణించారు. శశికళ సహా మిగతా ముగ్గిరిపై కేసును కొనసాగించిన సుప్రీంకోర్టు తన సంచలన తీర్పును ఇచ్చింది. దీంతో జయలలిత వారసురాలినంటూ చెప్పుకుంటూ వచ్చిన శశికళ ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోల్డెన్ బే రెసార్ట్‌లో చిన్నమ్మ నిద్రలేని రాత్రి.. ఇక రాజకీయ సీన్లొద్దు.. కట్టిపెట్టండి...పనేదో చూడండి..