ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటకు అసలు కారణం బయటపడింది. గత ఫిబ్రవరిలో జరిగిన ఈ విషాద ఘటనకు ప్యాసింజర్ తలపై మోస్తున్న పెద్ద బ్యాగ్ కిందపడటమే ప్రధాన కారణమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో వెల్లడించారు.
ఢిల్లీలోని రైల్వే స్టేషన్ తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో అసలు కారణం వెలుగులోకి వచ్చింది. మహా కుంభమేళా కారణంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో, ఫిబ్రవరి 15న రాత్రి 8:48 గంటలకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి-3పై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్లాట్ఫారమ్ నంబర్ 14, 15లను కలుపుతుంది. చాలా మంది ప్రయాణికులు తమ తలలపై భారీ లగేజీని మోసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో, ఒక ప్రయాణికుడు తలపై మోస్తున్న ఒక పెద్ద బ్యాగ్ జారి కిందపడింది.
దీంతో పై మెట్లపై ఉన్న ప్రయాణికులు కింది మెట్లపై ఉన్న వారిని నెట్టుకున్నారు. ఇది డొమినో ప్రభావంలా పనిచేసి, మెట్లపై ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ తొక్కిసలాటలో 18 మంది చనిపోగా, 15 మంది గాయపడ్డారు.