తమిళనాడు రాష్ట్రంలో పరువు హత్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ తరహా హత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ ఇవి మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఈ నేపథ్యంలో సీపీఎం తమిళనాడు రాష్ట్ర శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక సంస్కరణల దిశగా ఆ పార్టీ ఒక కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో పెరిగిపోతున్న పరువు హత్యలకు వ్యతిరేకంగా తమ పార్టీ కార్యాలయం ప్రేమ వివాహాలకు వేదిక మారుస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది. కులాంతర, ఆత్మగౌరవ వివాహాలు చేసుకునే తమ పార్టీ కార్యాలయాలు ఎల్లపుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేసింది.
చెన్నై మైలాపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ పార్టీ తమిళనాడు రాష్ట్ర శాఖ కార్యదర్శి పి.షణ్ముగం ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో పరువు హత్యల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఈ దురాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
ఈ సందర్భంగా పరువు హత్యలను అరికట్టేందుకు తక్షణమే ఒక కఠినమైన చట్టాన్ని తీసుకుని రావాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాల మధ్యనే కాకుండా, కొన్నిసార్లు ఒకే సామాజిక వర్గంలో కూడా ఈ పరువు హత్యలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రేమికులకు భరోసా కల్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.