ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయుడు... పీకల వరకు మద్యం సేవించి వచ్చి బాలికలతో అసభ్యంగా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ హెచ్ఎంను సస్పెండ్ చేశారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, బలరాంపూర్ జిల్లా వాడ్రాఫ్ నగర్ పరిధిలోని పశుపతి పూర్ ప్రాథమిక పాఠశాలలో లక్ష్మీ నారాయణ సింగ్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అతడు తరగతి గతిలో తన మొబైల్ ఫోనులో పాటలు పెట్టి, మద్యం మత్తులో విద్యార్థినులతో కలిసి అనుచితంగా డ్యాన్స్ చేశాడు. పాఠశాల సిబ్బందితో ఒకరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ వీడియో వైరల్ కావడంతో విద్యార్థుల నుంచి మరిన్ని ఫిర్యాదులు కూడా అందాయి. లక్ష్మీ నారాయణ సింగ్ తరచూ పాఠశాలకు మద్యం సేవించి వస్తాడని, ఎలాంటి కారణం లేకుండా తమను శారీరకంగా దండిస్తాడంటూ పలువురు బాలికలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో పాటు విద్యార్థుల ఆరోపణలపై జిల్లా విద్యాశాఖ అధికారి డీఎన్ మిశ్రా తీవ్రంగా స్పందించారు. హెచ్.ఎం.ను తక్షణే సస్పెండ్ చేస్తూ, బలరాంపూర్లోని డీఈవో కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.