దేశంలోనే తొలిసారి క్యాష్ ఆన్ వీల్ అందుబాటులోకి రానుంది. ముంబై నుంచి మన్మాడ్ వెళ్లే పంచవటి ఎక్స్ప్రెస్ రైలులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన ఏటీఎంను అమర్చింది. భారతీయ రైల్వే చరిత్రలోనే ఇలా రైలులో ఏటీఎంను అమర్చడం ఇదేతొలిసారి కావడం గమనార్హం. ఏసీ చైర్ కార్ కోచ్ చివరిలో సాధారణంగా ఉండే ప్యాంట్రీలో ఈ ఏటీఎంను ఏర్పాటుచేశారు. దీనికి ప్రత్యేకమైన షెటర్ను అమర్చారు. ఇప్పటికే దాని ట్రయల్ రన్ కూడా విజయవంతమైనట్టు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో మన దేశంలో తొలిసారిగా ఏటీఎం సేవలు కలిగిన రైలుగా పంచవటి ఎక్స్ప్రెస్ చరిత్రపుటలకెక్కింది.
ఇక ఈ ఏటీఎం రైలు కదులుతున్నపుడు కూడా ప్రయాణికులు నగదు విత్డ్రా చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. దీనిని భారతీయ రైల్వేలో ఇన్నేవేటివ్ అండ్ నాన్ ఫేర్ రెవెన్యూ ఐడియాస్ స్కీమ్లో భాగంగా, ప్రవేశపెట్టారు. భారత రైల్వేల భూసావల్ విభాగం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భాగస్వామ్యంతో ఈ అద్భుతమైన సౌకర్యం సాధ్యమైంది.
దీనిపై భూసావల్ డివిజినల్ రైల్వే మేనేజర్ ఇతి పాండే స్పందిస్తూ, "ఫలితాలు బాగున్నాయి. ప్రజలు ఇపుడు ప్రయాణించేటపుడు నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం పనితీరు మేము పర్యవేక్షిస్తున్నానే ఉంటాం" అని తెలిపారు.