Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సార్వత్రిక ఎన్నికల సమరం : ఏడో దశ ఎన్నికల ప్రచారం పరిసమాప్తం!!

election commission of india

ఠాగూర్

, గురువారం, 30 మే 2024 (19:34 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా, గురువారం ఏడో దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. జూన్ ఒకటో తేదీన 57 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. తుది దశ కావడంతో వివిధ రాజకీయ పార్టీల నేతలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. మొత్తం ఏడు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతంలో 57 లోక్‌సభ నియోజకవర్గాలు పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు జరిగిన ఆరు దశల్లో 486 లోక్‌సభ సీట్లకు పోలింగ్‌ ముగిసిన విషయం తెల్సిందే. 
 
ఈ ఏడో దశలో ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌లో 13 చొప్పున, పశ్చిమబెంగాల్‌లో తొమ్మిది, బిహార్‌లో ఎనిమిది, ఒడిశా ఆరు, హిమాచల్‌ ప్రదేశ్‌లో నాలుగు, జార్ఖండ్‌లో మూడు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌ లోక్‌సభ స్థానానికి శనివారం పోలింగ్‌ నిర్వహించనున్నారు. వీటితోపాటు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకూ అదేరోజు ఓటింగ్‌ జరగనుంది. జూన్‌ 4 కౌంటింగ్‌ ఉంటుంది.
 
మునుపటి ఎన్నికలతో పోలిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి దాదాపు 200లకుపైగా బహిరంగ సభలు, రోడ్‌ షోలలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ నియోజకవర్గం వారణాసికి కూడా తుది దశలోనే పోలింగ్‌ జరగనుంది.
 
కాగా, తుది విడత పోలింగ్‌ శనివారంతో ముగియనుండడంతో అదే రోజు సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువడనున్నాయి. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించి ప్రముఖ మీడియా/ ప్రైవేటు సంస్థలు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఈ అంచనాలను వెలువరించనున్నాయి. 
 
తుది ఫలితాలు జూన్‌ 4న వెలువడనున్నాయి. దేశంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మూడోసారి అధికారం చేపడుతుందా? అంచనాలను తలకిందులు చేస్తూ ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? అనేది ఆ రోజు తేలుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరాయి మహిళతో అడ్డంగా దొరికిన భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మిస్ వైజాగ్! (Video)