గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఎయిర్ ఇండియా కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకూ 274 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కాగా శనివారం నాడు రెస్క్యూ సిబ్బంది చేపట్టిన సహాయ కార్యక్రమాల్లో భవనంపై చిక్కుకుపోయిన విమానం తోక భాగాన్ని తొలగిస్తున్నారు. అలా తొలగిస్తున్న సమయంలో తోక భాగంలో మృతదేహం చిక్కుకుపోయి కనిపించింది. ఆ మృతదేహం విమానంలో ఎయిర్ హోస్టెస్గా విధులు నిర్వహిస్తున్న యువతిదిగా గుర్తించారు.
భార్య చివరి కోర్కె తీర్చడానికి వచ్చి అనంత లోకాలకు...
తన భార్య చివరి కోరికను తీర్చడానికి, ఆమె అస్థికలను ఆమె పూర్వీకుల గ్రామంలోని చెరువులో నిమజ్జనం చేయడానికి అతను భారతదేశానికి వచ్చాడు. అహ్మదాబాద్ నుండి లండన్కు వెళ్లేందుకు అతడు ఎయిర్ ఇండియా విమానం ఎక్కినప్పుడు, తన కుమార్తెలను తిరిగి కలవలేనని అతనికి తెలియదు.
వివరాల్లోకి వెళితే.. అర్జున్ పటోలియా తన భార్య భారతి, ఎనిమిది, నాలుగు సంవత్సరాల వయస్సు గల వారి ఇద్దరు కుమార్తెలతో లండన్లో వుండేవాడు. భారతి కొన్ని రోజుల క్రితం మరణించింది. ఆమె అస్థికలను గుజరాత్లోని అమ్రేలి జిల్లాలోని వాడియా అనే తన పూర్వీకుల గ్రామంలోని చెరువులో నిమజ్జనం చేయాలనే ఆమె చివరి కోరికను తీర్చడానికి అర్జున్ భారతదేశానికి వచ్చాడు.
ఈ నెల ప్రారంభంలో వాడియాలో భారతి స్మారక కార్యక్రమం కూడా నిర్వహించబడింది. వారి కుమార్తెలు లండన్కు తిరిగి వచ్చినప్పుడు అర్జున్ కొన్ని రోజులు భారతదేశంలోనే ఉన్నాడు. శుక్రవారం, అర్జున్ అహ్మదాబాద్ నుండి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి ఎయిర్ ఇండియా విమానం 171 ఎక్కాడు.
కానీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఇద్దరు కుమార్తెల పరిస్థితి దారుణంగా మారింది. నెలల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన ఆ కుమార్తెల పరిస్థితి దారుణమని వారి సన్నిహితులు వాపోతున్నారు.