Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెంగాల్ - అస్సోం ఎన్నికలు : తొలి దశ పోలింగ్ ప్రారంభం

బెంగాల్ - అస్సోం ఎన్నికలు : తొలి దశ పోలింగ్ ప్రారంభం
, శనివారం, 27 మార్చి 2021 (08:35 IST)
పశ్చి‌మ‌బెంగాల్‌, అస్సోం రాష్ట్రాల్లో తొలి దశ పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. బెంగాల్ రాష్ట్రంలో తొలి దశలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ దశలో 73,80,942 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
 
బెంగా‌ల్‌లో తొలి‌దశ పోలింగ్‌ కోసం 7,061 పోలింగ్‌ స్టేషన్లు, 10,288 పోలింగ్‌ బూత్‌లు ఏర్పా‌టు ‌చే‌శారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ, అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. 
 
పోలింగ్ కేంద్రాల వద్ద థర్మల్‌ స్కానర్లు, హ్యాండ్‌ శానిటైజర్లు, సబ్బులు.. సిబ్బందికి మాస్క్‌లు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఉదయం నుంచే ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. కరోనా మహమ్మారి వేళ గంట సమయం పొడగించారు.
 
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో అందరి దృష్టి బెంగాల్‌పైనే నెలకొంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలు అసక్తికరంగా మారాయి. శనివారం మొదటి విడతలో30 స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. తొలి విడతలో నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 
 
తొలి విడత ఎన్నికల కోసం 684 కంపెనీల బలగాలను మోహరించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. పురులియా, బంకురా, జార్‌గ్రామ్‌, పుర్బా మేదినిపూర్‌, పశ్చిమ మేదినిపూర్‌లో ఎన్నికలు జరుగుతుండగా.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా బూత్‌కు 11 మంది చొప్పున పారామిలటరీ సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు. 
 
జిల్లా పరిధిలో ఉన్న మొత్తం 1,307 పోలింగ్‌ బూత్‌లన్నింటినీ నక్సల్స్‌ ప్రభావిత ప్రకటించగా.. 144 కేంద్ర బలగాల జార్‌గ్రామ్‌లో అధికారులు మోహరిస్తున్నారు. బెంగాల్‌ తొలి విడత ఎన్నికల్లో 191 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటుండగా.. 74లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.
 
మరోవైపు, అస్సోంలో కూడా తొలి దశ పోలింగ్ జరుగనుంది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మూడు దశల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి దశలో 47 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. మొత్తం 2.33 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 11537 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి దశలో 264 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 
 
వీరిలో ముఖ్యమంత్రి శర్వానంద సొనొవాల్‌, స్పీకర్‌ హితేంద్రనాథ్‌ గోస్వామి, పీసీసీ అధ్యక్షుడు రిపున్‌ బోరా, అనేకమంది మంత్రుల భవితవ్యం శనివారం ఈవీఎంల్లో నిక్షిప్తమవుతుంది. బీజేపీ-ఏజీపీ కూటమికి, కాంగ్రెస్‌ సారథ్యంలోని 8 పార్టీల మహాకూటమికి మధ్యే ప్రధాన పోటీ అయినా కొత్తగా పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీ-అసొం జాతీయ పార్టీ(ఏజేపీ), దాని మిత్రపక్షం రైజోర్‌ దళ్‌ ఈ రెండు కూటములు అభ్యర్థుల విజయావకాశాలకు గండికొట్టే అవకాశాలున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస్క్ లేదా... రూ.500 అపరాధం.. 144 సెక్షన్ అమలు : చత్తీస్‌గఢ్