Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫిబ్రవరి 14... కేజ్రీకి స్పెషల్‌... అదేంటో తెలుసా?

ఫిబ్రవరి 14... కేజ్రీకి స్పెషల్‌... అదేంటో తెలుసా?
, బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (10:53 IST)
ప్రజాసంక్షేమం.. సంరక్షణ.. సంస్కారం! 'మినీ భారత్'లో సామాన్యుడి అసాధారణ విజయానికి కారణాలివే! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్‌ విజయం సాధించింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆయనకు ఓట్లు రాల్చాయి! మహిళలు, ఢిల్లీ ప్రజల సంరక్షణకు ఆయన తీసుకున్న నిర్ణయాలు మరోసారి విజయాన్ని అందించాయి! ముఖ్యమంత్రిగానే కాదు.. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన చూపిన సంస్కారం విజయ తీరాలకు చేర్చింది. వెరసి, కేజ్రీవాల్‌ మేజిక్‌ మరోసారి పనిచేసింది. 
 
బీజేపీ విభజన రాజకీయాల ఉచ్చులో పడకపోవడం.. జాతీయత విషయంలో రాజీలేదని స్పష్టం చేయడం.. ఐదేళ్లు అధికారంలో కొనసాగినా అవినీతి మరక పడకపోవడం.. ఉచిత పథకాలు ఆప్‌ గెలుపును నల్లేరుపై బండి నడక చేసేశాయి. దీనికితోడు, ముస్లిములంతా ఏకం కావడంతో ఢిల్లీని ఆప్‌ తమ ఎన్నికల గుర్తు చీపురుతో ఊడ్చేసింది. దీంతో ఆప్ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ మరోమారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదీకూడా తనకు అచ్చొచ్చిన ప్రేమికుల రోజున సీఎం కుర్చీలో కూర్చోనున్నారు. 
 
అయితే, ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14వ తేదీన కేజ్రీవాల్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. 2012 నవంబరులో 'ఆప్'ని స్థాపించారు. ఆప్‌ తొలిసారిగా 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. హంగ్‌ అసెంబ్లీ ఏర్పడడంతో కాంగ్రెస్ పార్టీతో ఆప్‌ చేతులు కలిపి అధికారంలోకి వచ్చింది. కొన్నాళ్లకే ఇరు పార్టీలు కత్తులు దూసుకోవడం మొదలుపెట్టాయి. ఫలితంగా 2014 ఫిబ్రవరి 14న సీఎం పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేశారు. 
 
2015 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఆప్‌ 67 స్థానాలు గెలిచింది. ఫిబ్రవరి 14వ తేదీన రామ్‌లీలా మైదానంలో కేజ్రీవాల్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒ యేడాది తర్వాత సరిగ్గా అదే రోజు ఆయన ఓ ట్వీట్‌ చేశారు. 'గత ఏడాది ఇదే రోజు ఢిల్లీ ఆప్‌తో ప్రేమలో పడింది. ఈ బంధం దృఢమైనది. చిరకాలం నిలిచేది' అని రాశారు. ఇప్పుడు కూడా ప్రమాణ స్వీకారానికి ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14వ తేదీనే కేజ్రీవాల్‌ ఎంచుకోనున్నారని సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డైమండ్ ప్రిన్స్‌ విహార నౌకలో 66 మందికి కరోనా వైరస్...