కాశ్మీర్ లోయలోని పహల్గాం, బైసరన్లో పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు పాశవికంగా పర్యాటకులపై కాల్పులు జరిపిన 25 మందిని హతమార్చారు. ఈ ఉగ్ర చర్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయంలోకి ఓ వ్యక్తి కేక్ బాక్సుతో లోనికి వెళుతున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయాన్ని గమనించిన మీడియా ప్రతినిధులు కేక్ బాక్స్తో వెళుతున్న వ్యక్తిని చుట్టుముట్టి.. ఏ సంబరాలు చేసుకునేందుకు కేక్ తీసుకెళుతున్నారు? మీరు పాకిస్థాన్ హైకమిషన్కు చెందిన వ్యక్తా? ఈ బాక్సులో ఏముంది? కేక్ తీసుకెళ్లేందుకు సందర్భం ఏంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించినప్పటికీ ఆ వ్యక్తి మాత్రం సైలెంట్గా వెళ్లిపోయాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. పహల్గాం ఘటనతో విషాదం నెలకొన్న వేళ సంబరాలా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ విషయంలో భారత్ ఇప్పటికే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధూ నది జలాల ఒప్పందం అమలును రద్దు చేసింది. ఇరు దేశాల మధ్య అటారీ సరిహద్దును మూసివేసింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో పని చేస్తున్న సిబ్బందికి అల్టిమేటం జారీచేసి మే ఒకటో తేదీ లోపు దేశాన్ని వీడి వెళ్లాలని ఆదేశించింది. అలాగే, పాక్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ఎక్స్ ఖాతాను కూడా భారత్లో నిలిపివేసింది.