అత్యాచారం, మోసం కేసులో పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆమ్మ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ థిల్లాన్ను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా, ఆయన పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పటియాలాలోని సనూర్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జిరాక్పూర్కు చెందిన ఓ మహిళ చేసిన ఆరోపణల మేరకు హర్మీత్పై కేసు నమోదైంది. తనకు విడాకులయ్యాయని చెప్పి, ఎమ్మెల్యే తనతో సంబంధం కొనసాగించాడని, ఆ మహిళ ఆరోపించింది. ఆ తర్వాత తనపై బెదిరింపులకు పాల్పడుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఆ తర్వాత ఆయనను పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా, ఆయన, ఆయన సహాయకులు అధికారులపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత వారంతా కలిసి కార్లలో పారిపోయారు. ఎమ్మెల్యే ఆయన అనుచరులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
అయితే, ఈ ఆరోపణలను ఎమ్మెల్యే హర్మీత్ ఖండించారు. ఇది తనపై జరిగిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. అరెస్టుకు ముందు ఫేస్బుక్లో ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఆప్ ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలోని ఆప్ పంజాబ్ను చట్టు విరుద్ధంగా పాలిస్తోందని, ఆరోపించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తన గొంతు నొక్కేందుకే ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.