బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతోంది. ముక్కుపచ్చలారని బాలికలపై కామాంధుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. బీర్భూమిలోని తారాపిట్ ఏరియాలోఇంట్లో నిద్రపోతున్న చిన్నారిని కొందరు గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పక్కనే ఉన్న సబ్ మెర్సిబుల్ పంప్ దగ్గర పడేసి అక్కడించి ఉడాయించారు.
చిన్న గదిలో బాలిక అమ్మమ్మతో కలిసి నిద్రపోతున్నప్పుడు దుండగులు హత్యాచారానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. తన పక్కన నిద్రపోతున్న చిన్నారి అదృశ్యం కావడంతో బాధితురాలి అమ్మమ్మ గట్టిగా కేకలు పెట్టి అందరిని అప్రమత్తం చేసింది. తెల్లవారి లేచి చూసేసరికి రక్తపు మడుగులో ఉన్న చిన్నారి మృతదేహం కనిపించడంతో ఆ కుటుంబం శోకసాగరంలో మునిగిపోయింది. వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసు అధికారి కమల్ బైరాగ్య తెలిపారు. స్నిఫర్ డాగ్స్ సహాయంతో విచారణ చేపట్టినట్టు తెలిపారు. పోస్ట్మార్టం నివేదిక తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని వెల్లడించారు.