మాజీ ప్రధానమంత్రి, బీజేపీ సీనియర్ నేత అటల్ బీహారీ వాజ్పేయిని శుక్రవారం దేశ రాజధానిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ రావు భగవత్ కలుసుకున్నారు. వాజ్పేయి ఆరోగ్య పరిస్థితిని భగవత్ పరామర్శించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇద్దరు నేతలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో తాజాగా నెలకొన్న రాజకీయ సంక్షోభంపై కూడా చర్చలు జరిపినట్లు సమాచారం.
బీజేపీ నాయకత్వంతో ఆర్ఎస్ఎస్ చీఫ్ గత నెలలో జరిపిన చర్చలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆ సందర్భంగా భగవత్ బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, రాజ్నాథ్ సింగ్లు పార్టీలో తమ పాత్రలను నిర్ణయించుకోవాలని భగవత్ సూచించారు. బీజేపీ భవిష్యత్కు ఎలాంటి ప్రమాదం లేదని, పార్టీ భవిష్యత్ మెరుగ్గానే ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. బీజేపీలో అంతర్యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని గత కొంతకాలంగా ఆర్ఎస్ఎస్ సూచిస్తున్న సంగతి తెలిసిందే.