హిందువులు మనోభావాలు దెబ్బతినకుండా, రామసేతు వారధిని కూల్చకుండా సేతు సముద్ర కాలువ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్.నారిమన్ సుప్రీం కోర్టుకు తెలిపారు. ఇందుకోసం పర్యావరణ పరిరక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
ఈ కమిటీని ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ఆర్కే.పచౌరి నేతృత్వంలో ఆరుగురు సభ్యులు ఉంటారని కేంద్రం పేర్కొంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సేతు సముద్ర ప్రాజెక్టు కాలువ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రామసేతు వారధిని కూల్చి వేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.
సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలు కాగా, వీటిపై ప్రధాన న్యాయమూర్తి కేజి.బాలకృష్ణన్ నేతృత్వంలో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం దీనిపై విచారణ జరుగగా, కేంద్రం తరపున సీనియర్ న్యాయవాది నారిమాన్ హాజరయ్యారు.
రామసేతు ధ్వంసం కాకుండా ధనుష్కోటి-రామేశ్వరంల మధ్య ప్రత్యామ్నాయ మార్గానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సుప్రీం సూచించింది. అంతేకాకుండా పర్యావరణ కమిటీ తుది నివేదిక అందిన తర్వాతే తీర్పు వెలువరిస్తామంటూ కేసు విచారణను సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది.