అక్టోబర్ 11న "యడ్డి" నడ్డి విరగడం ఖాయం: సిద్ధరామయ్య
అక్టోబరు 11న జరిగే బల పరీక్షలో కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప నడ్డి విరగడం ఖాయమని, ఆయన పీఠాన్ని వదిలిపెట్టి పక్కకు తప్పుకోవడం తప్పదని కర్నాటక ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య అన్నారు. యడ్యూరప్ప సర్కార్ కూలిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటు ఎవరు చేస్తారన్న దానికి, ఆ తర్వాత సంగతిని ఇపుడే చెప్పలేమన్నారు. ఇదిలావుంటే యడ్యూరప్ప ప్రభుత్వాన్ని ఎలాగైనా గట్టెక్కించాలన్న కృతనిశ్చయంలో భాజపా అధిష్టానం నడుం బిగించింది. ఆ బాధ్యతలను సీనియర్ నేత వెంకయ్యనాయుడికి అప్పగించింది. అసంతృప్తులందరూ తిరిగి సొంత గూటికి చేరుకోవాలని వెంకయ్య ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. కాగా కర్నాకట పర్యాటక శాఖామంత్రి గాలి జనార్థన్ రెడ్డి సైతం రంగంలోకి దిగి తిరుగుబావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలతో మంతనాలు సాగిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి యడ్యూరప్ప మరింత విజృంభించి మరో ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికారు. దీంతో అసమ్మతి శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలకు షాక్ తగిలనట్లయింది. మెల్లగా ఒక్కొక్కరూ మెత్తబడుతున్నట్లు సమాచారం. ఆరు నూరైనా పార్టీకి ధిక్కార స్వరాన్ని వినిపించేవారిని, క్రమశిక్షణ లేనివారిని వదిలే ప్రసక్తే లేదని యడ్యూరప్ప తెగేసి చెప్పారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని తిరిగి వస్తే ప్రజలు క్షమిస్తారనీ, లేదంటే భవిష్యత్తులో ప్రజల ముఖాలను వారు చూడలేనరన్నారు.