మహాశివరాత్రి: జాగరణ చేస్తూ.. నాలుగు జాముల్లో అభిషేకం చేస్తే?
, గురువారం, 13 ఫిబ్రవరి 2014 (18:16 IST)
త్రిమూర్తులతో లయకారుడైన పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపునిగా ఆవిర్భవించిన పరమపవిత్రమైన రోజు "మహాశివరాత్రి". ఈ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి, శిరస్నానం చేసి శివపూజలు, అభిషేకాలు చేయించాలి. పగలంతా ఉపవాసం ఉండాలి. రాత్రి జాగరణ చేస్తూ నాలుగు జాముల్లో అభిషేకం చేయవలెను. శివుడిని మొదటి జాములో పాలతో, అభిషేకం చేసి పద్మాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రెండో జాములో పెరుగుతో అభిషేకించి, తులసీదళాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగాను, మూడో జాములో నెయ్యి తీసుకుని స్వామికి అభిషేకించి మారేడు దళాలతో పూజించి, నువ్వులతో వండిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించవలెను. ఇక నాలుగో జాములో తేనెతో అభిషేకం చేసి, పువ్వులతో పూజించి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. లింగోద్భవ సయమంలో పూజలు చేయవలెను. మరునాడు తిరిగి శివపూజలు చేసి శక్తి మేరకు నైవేద్యం సమర్పించి భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి. ఈ దినం కూడా సూర్యాస్తమయం వరకు నిద్రించకూడదు. ఇలా నియమాలతో శివార్చన చేయడం సకల శుభప్రదం.