Publish Date: Mon, 04 Mar 2019 (10:54 IST)
Updated Date: Mon, 04 Mar 2019 (10:55 IST)
మహా శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, మహేశ్వరదర్శనం, అభిషేకం, బిల్వార్చన, శివనామ సంకీర్తనల వలన అజ్ఞానం తొలగిపోతుంది. జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. పార్వతీపరమేశ్వరులు, సూర్యుడు, అగ్ని ఈ మూడింటిలోను శివ భగవానుడు కొలువైవుంటాడు.
శివరాత్రి గురించి పార్వతీమాత ఓసారి పరమేశ్వరుడిని అడిగినప్పుడు.. శివరాత్రి అంటే తనకెంతో ఇష్టమని.. ఏమీ చేయకుండా ఆ రోజు ఉపవాసమున్నా సరే సంతోషిస్తానని చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి.
అందుకే పగలంతా నియమనిష్ఠతో ఉపవాసం ఉండి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చేయాలి. పంచామృతాలతో తొలుత పాలు, తర్వాత పెరుగు, నేయి, తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది. మరుసటి రోజు బ్రహ్మ విధులకు భోజనం వడ్డించిన తర్వాత భుజించి శివరాత్రి వ్రతం పూర్తిచేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదని పరమశివుడే స్వయంగా చెప్పినట్లు ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం. ఈ సమయంలో కనుక శివున్నిఅభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి. శివుడు అభిషేక ప్రియుడు. స్వామికి భక్తితో నీళ్ళతో అభిషేకం చేసిన చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడని.. అందుకే శివునిని భోళాశంకరుడని పిలుస్తారు.
ఈ మహా శివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంత జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదించి.. ఉపవాసం చేసిన వారు తినే కంటే ముందే ఆవుకు బియ్యం, తోటకూర, బెల్లం కలిపి తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేద వారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి.
పశు, పక్ష్యాదులకు కూడా ఏదైన అవి తినే ఆహార పదార్ధాలు, త్రాగడానికి నీటిని వాటికి ఏర్పాటు చేయాలి. ఈ తంతు పూర్తి చేసిన తర్వాతనే తన ఉపవాస దీక్ష విరమణ చేయాలి. ఇలా చేస్తే.. ఎంతో పుణ్యం లభించడంతో పాటు సమస్త గ్రహదోష నివారణ కలిగి దైవానుగ్రహం పొందుతారని విశ్వాసం.
webdunia
Publish Date: Mon, 04 Mar 2019 (10:54 IST)
Updated Date: Mon, 04 Mar 2019 (10:55 IST)