Publish Date: Wed, 01 Apr 2015 (15:22 IST)
Updated Date: Wed, 01 Apr 2015 (15:23 IST)
పిల్లల్లో ఆలోచనాశక్తి పెంపొందించాలంటే.. ఏం చేయాలంటే? వారి వయసును బట్టి రకరకాల టాయ్స్ను ఆడుకునేందుకు ఇవ్వాలి. ఈ బొమ్మలతో ఆడుకునే క్రమంలో పిల్లలు ఐదు రకాల సెన్స్ను ఉపయోగించడం ప్రారంభిస్తారు. ఆర్నెల్ల వయస్సు వరకు పిల్లలకు మెత్తగా వుండే రంగు రంగుల బొమ్మలు ఇవ్వాలి. అవి వారు పట్టుకునేందుకు వీలుగా వుండాలి. ఆ బొమ్మ ఏదో ఒక సౌండ్ చేసేదై వుండాలి. వీటితో ఆడడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత, గ్రహణశక్తి పెంపొందుతుంది.
ఆరు నెలల నుంచి సంవత్సరం వయస్సు వరకు బొమ్మలతో ఆడుకునేందుకు పిల్లలు బాగా ఉత్సాహం చూపుతారు. డ్రమ్స్, బాల్స్ వంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇష్టపడతారు. బొమ్మల రంగులను, ఆకృతిని గుర్తించడం ఆరంభిస్తారు. బొమ్మలను తీసుకోవడం, వాటిని విసిరివేయడం మళ్లీ తెచ్చుకోవడం స్వంతంగా చేస్తారు.
ఒకటి రెండు సంవత్సరాల వయసులో బొమ్మలను నోటి దగ్గరకు తీసుకెళ్ళడం మానేస్తారు. కలరింగ్, పెయింటింగ్ ఇష్టపడతారు. బ్లాకులను ఒకదానిలో ఒకటి బిగిస్తారు. పజిల్స్ ఆడతారు. సమస్యలను పరిష్కరించుకోవడం, ఆలోచనాధోరణిని మెరుగుపరుచుకోవడంలో ఈ బొమ్మలు పిల్లలకు సహకరిస్తాయి.
రెండున్నర మంచి ఐదేళ్ల వయసులో స్పీడ్ సెన్సేషన్ను అభివృద్ధిపరుచుకోగల మూడుచక్రాల సైకిళ్ళు, ఇతర చిన్న చిన్న వాహనాలు వారికి అవసరం. పిక్చర్స్, కథల పుస్తకాలు, కటింగ్ పేస్టింగ్ వర్క్ వంటివి వారికి అందుబాటులో వుంచాలి. క్యాసెట్ ప్లేయర్లు, విజిల్స్ వంటివీ ఇవ్వాలి. దీనివల్ల వారిలో రిథమ్ సెన్స్ పెరుగుతుంది.