పిల్లల్ని ప్రతిభావంతులుగా ఎలా తీర్చిదిద్దాలనే సవాల్ చాలా తల్లిదండ్రులది. దానికోసం పిల్లలకు అదేపనిగా ఉపన్యాసాలు ఇవ్వడం కన్నా.. ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టి చూడండి.
* పద బంధాలూ, చెస్ వంటివి పిల్లల మెదడుని చురుగ్గా మారుస్తాయి. సుడుకోను నేర్పించండి. పిల్లలు సంగీతం పాడినా, వాద్య పరికరం వాయించినా, వాళ్ల కుడివైపు మెదడు పనితీరు చురుగ్గా పనిచేస్తుంది. ఎలాంటి సంగీతం నేర్చుకున్నా పిల్లల్లో ఐక్యూ బాగుంటుందనీ, ఆ పిల్లలు చదువుల్లో రాణిస్తారని అధ్యయనాల్లో తేలింది.
* చురుగ్గా ఆడుకోవడం, స్కూల్లో క్రీడల్లో పాల్గొనడం వల్ల వాళ్లల్లో ఆత్మవిశ్వాసం పెరగడం, బృందంతో కలిసి పనిచేయడం, నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకునేలా చిన్నారుల్ని ప్రోత్సహించాలి. విజ్ఞానాన్ని పెంచడానికి సులువైన టెక్నాలజీతో సంబంధం లేని మార్గం.. పుస్తకపఠనం. వారికి చిన్న వయసు నుంచే పుస్తకాలు చదవటం అలవాటు చేయండి.
అధ్యయనాల ప్రకారం.. పొద్దున్నే టిఫిన్ తినని వారితో పోలిస్తే .. తినే వారిలో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రత కుదురుతుంది. దీంతో పిల్లలు దేన్నయినా సులువుగా నేర్చుకుంటారు. అందుకే పొద్దున్నే అల్పాహారం తినిపించడం అన్నివిధాలా మంచిది.